అయోధ్య మోడల్లో వరంగల్ ఎయిర్పోర్ట్..త్వరలోనే పనులు మొదలు

అయోధ్య మోడల్లో వరంగల్ ఎయిర్పోర్ట్..త్వరలోనే పనులు మొదలు
  • ఎయిర్ పోర్ట్  అథారిటీ ప్లాన్
  • విమానయాన శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం
  • భూసేకరణ స్పీడప్ చేసేందుకు ఇటీవలే రూ.295 కోట్లు ఇచ్చిన రాష్ట్ర సర్కార్
  • త్వరలోనే పనులు మొదలు పెట్టేలా ఏఏఐ అడుగులు

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లులోని మామునూర్‍ ఎయిర్‍పోర్టును ఉత్తరప్రదేశ్‍ రాష్ట్రంలోని అయోధ్య విమానాశ్రయం తరహాలో జెట్‍ స్పీడుతో నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు అవసరమైన రూ.295 కోట్లు రేవంత్‍రెడ్డి ప్రభుత్వం ముందస్తుగా ఇవ్వడంతో పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్ర సర్కారు భూములను కేంద్రానికి అప్పగిస్తే.. ఎయిర్‍పోర్ట్  అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఐ) వెంటనే రంగంలోకి దిగనుంది. యూపీలోని అయోధ్య ఎయిర్‍పోర్ట్  తరహాలో మామునూర్‍ ఎయిర్‍పోర్టును తక్కువ సమయంలోనే నిర్మించి ఓరుగల్లువాసులకు బహుమతిగా అందించనున్నట్లు రాష్ట్ర సర్కారు, జిల్లా అధికారులకు సమాచారమిచ్చింది.

50 శాతం భూసేకరణ కంప్లీట్.. 

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూసేకరణ కోసం పరిహారం పెంపు, రూ.295 కోట్ల నిధులు విడుదలతో ఈ ప్రక్రియ స్పీడప్‍ అయింది. వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టడంతో 50 శాతం భూసేకరణ పూర్తయింది. రైతుల భూములకు సంబంధించి రూ.138 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. మిగతా వాటికి చెక్కులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫండ్స్  అందుబాటులో ఉండడంతో మిగతా భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

20 నెలల్లోనే అయోధ్య ఎయిర్‍పోర్ట్.. 

ఉత్తర ప్రదేశ్‍ రాష్ట్రం ఫైజాబాద్‍ జిల్లాలో చేపట్టిన ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్  ఎయిర్‍పోర్ట్(అయోధ్య ధామ్‍)’ను ఏఏఐ అధికారులు కేవలం 20 నెలల్లోనే పూర్తి చేశారు. 821 ఎకరాల భూముల్లో రూ.1,625 కోట్లతో పనులు చేపట్టగా.. ఇంటర్నేషనల్‍ ఎయిర్‍పోర్టుగా మూడు దశల్లో అభివృద్ధి చేసే క్రమంలో విమాన సేవలు అందించే మొదటి దశ పనులు కంప్లీట్‍ చేశారు. 2020 ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టి 20 నెలల్లో పూర్తి చేయగా.. ప్రధాని మోదీ 2023 డిసెంబర్‍ 30న దీనిని ప్రారంభించారు. 2024 జనవరి 10 నుంచి అయోధ్య విమానాశ్రయం నుంచి ప్రయాణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రన్‍వే పొడవు 7,381 అడుగులు(2,250 మీటర్లు) ఉండగా, టెర్మినల్‍ 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.  మొదటి దశలో టెర్మినల్‍లో 09 చెక్‍ ఇన్‍ కౌంటర్లు, 3 కన్వేయర్‍ బెల్ట్ లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. టెర్మినల్‍ బయట 4 పార్కింగ్‍ స్థలాలు, సర్వీస్‍, యుటిలిటీ ప్రాంతాలున్నాయి. ఇక్కడి నుంచి ఫైజాబాద్‍, అయోధ్యలను కలిపేందుకు నేషనల్ హైవే 27 మార్గంలో 4 లేన్ల అప్రోచ్‍రోడ్‍, ఫైర్‍ స్టేషన్‍, ఎయిర్‍ ట్రాఫిక్ కంట్రోల్‍(ఏటీసీ) టవర్‍, టెక్నికల్‍ బ్లాక్‍, ఫ్యుయల్ బంక్‍, 3 మిడిల్‍ క్లాస్ హోటల్స్, మరో 4 స్టార్ హోటళ్లు అందుబాటులో ఉండేలా ఎయిర్‍పోర్ట్  నిర్మించారు. అయోధ్య ఎయిర్‍పోర్టులో మొదటి దశలో ఏ–321 రకం విమానాల నిర్వహణకు కావాల్సిన నిర్మాణం పూర్తయింది. రెండు లింక్‍ టాక్సీవేలతో పాటు ఏ–321 మాడల్‍ 8 విమానాలు పార్కింగ్‍ చేసేందుకు అనువుగా ఉంది. ప్రస్తుతం ఎయిర్‍ ఇండియా ఎక్స్​ప్రెస్‍, ఇండిగో ఎయిర్‍ లైన్స్ ఇక్కడి నుంచి బెంగళూరు, ఢిల్లీ, గ్వాలియర్‍, అహ్మదాబాద్‍, ముంబై వంటి నగరాలకు సర్వీసులు అందుబాటులోకి తెచ్చాయి. విమానాశ్రయం రెండో దశ అభివృద్ధిలో 50 వేల చదరపు మీటర్ల కొత్త టెర్మినల్‍ నిర్మాణాన్ని డెవలప్‍ చేసేలా ప్లాన్‍ చేశారు. రన్‍వే 2,200 చదరపు మీటర్ల నుంచి 3,750 మీటర్లకు పెంచనున్నారు. 8 విమానాల నుంచి 18 విమానాల పార్కింగ్‍ స్థాయికి చేర్చేలా ప్రణాళికలు 
బరూపొందించారు.

253 ఎకరాలకు రూ.295 కోట్లు రిలీజ్..

ఓరుగల్లులో 40 ఏండ్లుగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా పని చేసిన మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  పున:ప్రారంభం విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‍గా తీసుకుంది. అడ్డంకులను ఒక్కొక్కటిగా క్లియర్‍ చేసింది. విమానాశ్రయానికి 949.14 ఎకరాల భూములు అవసరమని అధికారులు తేల్చగా, 696.14 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చోట్ల సర్కారు భూములు ఉన్న నేపథ్యంలో, 253 ఎకరాలు(220 సాగు భూములు, 33 ఎకరాలు ఖాళీ స్థలాలు, ప్లాట్లు) సేకరించాల్సి వచ్చింది. భూములిచ్చే రైతులకు పరిహారం అందించేందుకు మొదట్లో రూ.205 కోట్లు అవుతాయని భావించి, గతేడాది నవంబర్‍ 17న నిధులు కేటాయించింది. తీరా రైతులకు ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం పెంచడంతో ఖర్చు పెరిగింది. దీంతో మరో రూ.90 కోట్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న రిలీజ్​ చేసింది.  

253 ఎకరాలకు రూ.295 కోట్లు రిలీజ్..

ఓరుగల్లులో 40 ఏండ్లుగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా పని చేసిన మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  పున:ప్రారంభం విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‍గా తీసుకుంది. అడ్డంకులను ఒక్కొక్కటిగా క్లియర్‍ చేసింది. విమానాశ్రయానికి 949.14 ఎకరాల భూములు అవసరమని అధికారులు తేల్చగా, 696.14 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చోట్ల సర్కారు భూములు ఉన్న నేపథ్యంలో, 253 ఎకరాలు(220 సాగు భూములు, 33 ఎకరాలు ఖాళీ స్థలాలు, ప్లాట్లు) సేకరించాల్సి వచ్చింది. భూములిచ్చే రైతులకు పరిహారం అందించేందుకు మొదట్లో రూ.205 కోట్లు అవుతాయని భావించి, గతేడాది నవంబర్‍ 17న నిధులు కేటాయించింది. తీరా రైతులకు ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం పెంచడంతో ఖర్చు పెరిగింది. దీంతో మరో రూ.90 కోట్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న రిలీజ్​ చేసింది.  

త్వరలోనే భూసేకరణ 
కంప్లీట్  చేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వం మామునూర్‍ ఎయిర్​పోర్ట్  భూసేకరణకు నిధులను ఇవ్వడంతో ఈ ప్రకియను స్పీడప్​ చేశాం. అయోధ్య ఎయిర్‍పోర్ట్  తరహాలో మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ ను తక్కువ టైంలో పూర్తి చేసేందుకు విమానయాన శాఖ రెడీగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో భూసేకరణపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టాం. త్వరలోనే భూసేకరణ పూర్తిచేసి ఎయిర్​పోర్ట్  అథారిటీకి అప్పగిస్తాం.
– డాక్టర్‍ సత్యశారద, కలెక్టర్, వరంగల్‍