హైదరాబాద్ : పెళ్లై భార్యా, పిల్లలున్నా… మరదలిపై మనసుపడ్డాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో.. ఇపుడు ఊచల్లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది.
ముషీరాబాద్ గాంధీనగర్ కు చెందిర జాకబ్ కొనికి వయసు 40 ఏళ్లు. సిటీలోనే ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలున్నారు. భార్యా పిల్లలతో వేరుగానే ఉంటున్న అతడు… నిస్సహాయ స్థితిలో ఉన్న తన మరదలిపై మనసుపడ్డాడు. ఐతే.. చివరకు సీన్ రివర్స్ అయింది.
జాకబ్ మేనమామకు ఓ కూతురుంది. ఆమె వయసు 30 ఏళ్లు. సిటీలోనే ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగిని. తండ్రి చనిపోవడంతో ఆమె తన కుటుంబ పోషణ బాధ్యతలను తీసుకుంది. పెళ్లిని వాయిదావేస్తూ.. కుటుంబానికి ఆసరాగా ఉంటోంది.
ఐతే.. మేనబావ జాకబ్.. ఆమె నిస్సహాయతను ఆసరాగా తీసుకోవాలనుకున్నాడు. తనకు రెండో భార్యగా ఉండాలని వేధించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని జాకబ్ బెదిరించాడు. జాకబ్ ఫ్రెండ్స్ కూడా అతడికి మద్దతుగా నిలబడి… ఆయన్నే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. స్థానికుల జోక్యంతో అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగింది.
తిరిగి గత ఆదివారం ఆమెకు జాకబ్ ఫోన్ చేశాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ.. తననే పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. వేధింపులు పెరిగిపోవడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జాకబ్ పై కేసు పెట్టి.. అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.