గచ్చిబౌలి, వెలుగు: పెండ్లి చేసుకుంటానని వితంతు మహిళను నమ్మించి రూ.1.80 కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ వెంకటాద్రి రెసిడెన్సీలో నివసించే ఓ మహిళ(35) భర్త 2008లో చనిపోయాడు. తల్లిదండ్రుల సూచన మేరకు ఆమె మరో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. మ్యాట్రిమోనీ యాప్ లో తన వివరాలను అప్ లోడ్ చేసింది. ఆ యాప్ ద్వారా ఆమెకు కృష్ణ వంశీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను యూఎస్ రెసిడెంట్అని, గూగుల్లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. యూఎస్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి మహిళ కుటుంబ సభ్యులతో పెండ్లి విషయాలను చర్చించాడు. కొద్ది రోజులకు తన బ్యాంక్ అకౌంట్లు బ్లాక్అయ్యాయని..అన్ఫ్రీజ్ చేయడానికి డబ్బులు అవసరమని మహిళకు చెప్పాడు. కృష్ణవంశీ మాటలను నమ్మిన మహిళ.. తన హెచ్డీఎఫ్సీ, కొటాక్ మహీంద్రా, రెండు ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లకు చెందిన డెబిట్కార్డులతో పాటు తన వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అతనికి ఇచ్చేసింది.
వాటిని తీసుకున్న తర్వాత మహిళకు కృష్ణవంశీ నుంచి కాల్స్రావడం ఆగిపోయాయి. దాంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ మార్చి 28న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కృష్ణవంశీ తనను పెండ్లి పేరిట రూ. 1.80 కోట్లు చీటింగ్చేశాడని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు..నిందితుడు ఏపీలోని చిత్తూరు జిల్లా పాకాల మండలం వలపాలవారి పల్లి గ్రామానికి చెందిన కె. వంశీ చౌదరి(38)గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రెండు స్మార్ట్ఫోన్లు, కస్టమ్స్కు చెందిన రబ్బర్ స్టాంపులు, గూగుల్ కంపెనీ ఐటీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. వంశీ చౌదరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.