మోసపోయిన అక్కాచెల్లెళ్ళు.. బెదిరిస్తున్న యువకుడు

మోసపోయిన అక్కాచెల్లెళ్ళు.. బెదిరిస్తున్న యువకుడు

అచ్చం సినిమా టైపులో అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఆడుకున్నాడు ఓ మానవ మృగం. సిన్సియర్ గా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. ఇలాగే ఒకరికి తెలియకుండా ఒకరితో మాయమాటలు చెప్పి అక్కాచెల్లెళ్లను మోసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కాచెల్లి ఇదేంటని ప్రశ్నిస్తే..మీతో గడుపుతుండగా ఫొటోలు , వీడియోలు తీశానని మీరు గొడవ చేస్తే వాటిని ఇంటర్నెట్ లో పెడుతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అవసరమైనప్పుడల్లా రావాలంటూ వారిని లైంగికంగా వేధిస్తుండటంతో.. భరించలేని సోదరీమణులు తాము మోస పోయామంటూ తండ్రికి చెప్పుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన శనివారం ఏపీలోని పిఠాపురంలో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి
పిఠాపురానికి చెందిన హేమంత్‌ కుమార్‌ జగ్గయ్యచెరువు కాలనీలో ఉన్న కిరాణా షాపునకు తరుచూ వచ్చే 19 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు తన లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. ఆమెతో పరిచయాన్ని అడ్డం పెట్టుకుని యువతి చెల్లెలు అయిన మైనర్ బాలికనూ అదేవిధంగా నమ్మించాడు. ఆ బాలికతోనూ శారీరక సంబంధం పెట్టకున్నాడు. హేమంత్‌ చేసిన మోసం ఇటీవలే అక్కాచెల్లెళ్లు తెలుసుకున్నారు. దీంతో అతడిని నిలదీయగా వారిద్దరి న్యూడ్ ఫోటోలు తన దగ్గర ఉన్నాయని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. ఆ ఫోటోలను తన స్నేహితులతో పంచుకోవడంతో వారు కూడా అక్కాచెల్లెళ్లపై వేధింపులకు పాల్పడ్డారు.

బాధితురాళ్లు ఈ విషయాన్ని తండ్రికి చెప్పగా ఆయన పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హేమంత్‌కుమార్‌తో పాటు అతడి స్నేహితులు జె.అనిరుధ్ రెడ్డి, ప్రశాంత్‌తో పాటు ఇద్దరు యువతులపైనా వివిధ సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.