వేరొకరితో చనువుగా ఉంటుందని.. బ్లేడుతో గొంతు కోసిండు

వేరొకరితో చనువుగా ఉంటుందని.. బ్లేడుతో గొంతు కోసిండు

తీవ్రంగా గాయపడిన యువతి 
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉప్పల్, వెలుగు:
 వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని  ఓ యువతిపై ఆమె బంధువు బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. దీంతో  ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి.  ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడ స్ర్టీట్ నం.-8లో ఉండే లక్ష్మినారాయణ(36), రామంతాపూర్​ శ్రీనగర్​ కాలనీలో ఉండే యువతి (24 ) సమీప బంధువులు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మినారాయణ మ్యాంగో యూట్యూబ్​ పేరుతో ఓ చానల్​రన్ చేస్తుండగా.. యువతితో కలిసి వీడియోలను తీసి అప్​లోడ్ ​చేసేవాడు. షూట్​ల కోసం ఆమెతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవాడు. దీంతో లక్ష్మినారాయణ ఆమెతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించాడు. 

ఇటీవల సదరు యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అతనికి తెలిసింది. దీంతో లక్ష్మినారాయణ మాట్లాడాలంటూ సోమవారం యువతిని తన కారులో ఎక్కించుకుని ఉప్పల్ భగాయత్​ వైపు తీసుకెళ్లాడు.అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. కోపంలో లక్ష్మినారాయణ బ్లేడ్​తో యువతి మెడపై కోయడంతో  ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని బాధితురాలిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మినారాయణను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు.