- అఫిలియేషన్ కోసం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల జిమ్మిక్కులు
- సిబ్బందికి 3 నెలల జీతాలు క్లియర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామన్న జేఎన్టీయూ
- లెక్చరర్ల ఖాతాల్లో జీతం వేసి రిటర్న్ తీసుకుంటున్న మేనేజ్మెంట్లు
- పట్టించుకోని జేఎన్టీయూ ఆఫీసర్లు.. ఆందోళనలో ఫ్యాకల్టీ
హైదరాబాద్, వెలుగు: అబ్దుల్లాపూర్ మెట్లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్అక్కడే పని చేసే ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్కు 3 నెలలుగా అకౌంట్లో రూ.33 వేలు చొప్పున జీతం వేస్తోంది. అయితే డబ్బులు పడిన వెంటనే ఆ ఫ్యాకల్టీ ఆ మొత్తాన్ని మళ్లీ అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తికి రిటర్న్ పంపిస్తున్నారు. శాలరీ పేరుతోనే అతనికి రూ. 33 వేలు క్రెడిట్అయినా.. ఆయన వాస్తవ నెల జీతం మాత్రం రూ.16 వేలే. ఇదొక్కటే కాదు.. అఫిలియేషన్కోసం జేఎన్టీయూ పరిధిలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇదే తరహా జిమ్మిక్కులు చేస్తున్నాయి. సిబ్బందికి 3 నెలల శాలరీస్ క్లియర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ ప్రకటించడంతో ఆయా ఇంజనీరింగ్కాలేజీలు ఫ్యాకల్టీకి జీతాలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తీసుకుంటున్నాయి. స్టూడెంట్ల నుంచి ఫీజులు వసూలు చేస్తున్న మేనేజ్మెంట్లు, కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీకి మాత్రం రూల్స్ మేరకు నెలనెలా జీతాలివ్వడం లేదు. ప్రస్తుతం అఫిలియేషన్ టైమ్ కావడంతో ఆయా కాలేజీల నిర్వాకం ఇలా బయటపడుతోంది.
రాష్ట్రంలో 166 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో 30 వేలమంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనాతో గతేడాది మార్చి నుంచి మేనేజ్మెంట్లు లెక్చరర్లకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఆన్లైన్క్లాసులు నడుస్తున్నాయనే పేరుతో కొన్ని కాలేజీలు సగం జీతం ఇస్తుంటే, మరికొన్ని పెండింగ్లో పెట్టాయి. పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో జీతాలివ్వడం లేదని సిబ్బంది సామూహిక ధర్నాలు చేశారు. వారిలో కొంతమంది ఏఐసీటీఈతో పాటు జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్తమిళిసై సౌందరరాజన్కు లేఖలు రాశారు. దీన్ని సీరియస్గా తీసుకోవాలని గవర్నర్ ఆఫీసు నుంచి జేఎన్టీయూహెచ్కు ఆదేశాలు అందాయి. దీంతో జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్లపై దృష్టి సారించింది. ఫ్యాకల్టీకి గత మూడునెలలు జీతాలిచ్చినట్టు బ్యాంక్ స్టేట్ మెంట్లు కూడా ఇవ్వాలని, వర్సిటీ పంపించిన ఫార్మాట్లో సిబ్బంది వివరాలను పంపించాలని ప్రైవేటు కాలేజీలను ఆదేశించింది. దీంట్లో ఏమైనా తప్పులుంటే, తమదే బాధ్యతంటూ ప్రిన్సిపల్స్నుంచి లేటర్లు తీసుకుంటోంది. కాలేజీల అఫిలియేషన్కు సంబంధించిన ఫామ్121లో ఈ వివరాలన్నీ పొందుపర్చాలని సూచించింది. దరఖాస్తులకు ఈ నెల17 వరకు గడువు ఇచ్చింది. జేఎన్టీయూహెచ్ఆదేశాలతో సిబ్బందికి జీతాలు ఇయ్యడం తప్పనిసరి కావడంతో కొన్ని మేనేజ్మెంట్లు తప్పుడు మార్గాలను ఎంచుకున్నాయి. అఫిలియేషన్కు అవసరమైన ఏప్రిల్ నుంచి జులై వరకు ఫుల్ శాలరీస్సిబ్బంది ఖాతాల్లో జమ చేస్తున్నాయి. అయితే జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ వెనక్కి తీసుకుంటున్నాయి. కొన్ని కాలేజీలు గూగుల్పే, ఫోన్ పే ద్వారా రిటర్న్ తీసుకుంటుండగా, ఇంకొన్ని కాలేజీలు క్యాష్, చెక్కుల రూపంలో సిబ్బంది నుంచి తీసుకుంటున్నాయి. అయితే చాలా కాలేజీల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటి గురించి వర్సిటీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫ్యాకల్టీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీలు అంతంతేనా?
ఈనెల30 నుంచి ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో 24 లోపే కాలేజీ ఫ్యాకల్టీ వివరాలను ఆన్లైన్లో పంపించాలని మేనేజ్మెంట్లకు జేఎన్టీయూ ఆదేశాలిచ్చింది. ఈసారి కూడా కేవలం ఫ్యాకల్టీ వివరాల ఆధారంగానే అఫిలియేషన్ ఇవ్వాలని, వచ్చేనెలలో ఫిజికల్ గా తనిఖీలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో మేనేజ్మెంట్లకు కొంత కలిసొచ్చినట్లయింది. అక్టోబర్ 25 వరకు కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభించుకోవచ్చని ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్లో పేర్కొంది. దీనికి చాలా టైమ్ఉన్నా, అధికారులు ముందుగా కాలేజీల్లో తనిఖీలు చేయకుండానే అడ్మిషన్ షెడ్యూల్ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
విచారణ జరిపించాలె
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బందికి జీతాలిచ్చి, మళ్లీ తిరిగి తీసుకోవడం దారుణం. మెజార్టీ కాలేజీల్లో ఇదే నడుస్తోంది. దీనిపై జేఎన్టీయూహెచ్ అధికారులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు స్పందించి విచారణ జరిపించాలి. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. - సంతోష్కుమార్, టీఎస్ టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
ఏఎఫ్ఆర్సీ ద్వారా జీతాలియ్యాలె
కాలేజీ మేనేజ్మెంట్లు సిక్స్త్ పే ప్రకారం సిబ్బంది అకౌంట్లో శాలరీ వేస్తూ మళ్లీ తీసుకుంటున్నాయి. ఇదంతా జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. కరోనా పేరుతో18 నెలలుగా జీతాలు సరిగా ఇస్తలేరు. ఈ అక్రమాలను అరికట్టాలంటే ఏఎఫ్ఆర్సీ ద్వారా ఎంప్లాయీస్కు జీతాలియ్యాలె.
- బాలకృష్ణారెడ్డి, టీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు