కలెక్టర్ ట్రిపుల్ రోల్ .. మంచిర్యాల జిల్లాలో అడిషనల్ కలెక్టర్ల పోస్టులు ఖాళీ

కలెక్టర్ ట్రిపుల్ రోల్ .. మంచిర్యాల జిల్లాలో అడిషనల్ కలెక్టర్ల పోస్టులు ఖాళీ
  •  ఏడాదిగా లోకల్ బాడీస్ ఏసీ వేకెన్సీ
  • నెల క్రితం రెవెన్యూ ఏసీ రిటైర్
  • జిల్లా పరిషత్, కార్పొరేషన్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్​గా అదనపు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి 
  • దాదాపు సగం డిపార్ట్​మెంట్లలో ఇన్​చార్జీల పాలనే

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా యంత్రాంగానికి బాస్ గా వ్యవహరించే కలెక్టర్ ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 10 వరకు అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు నిత్యం వివిధ పనులతో బిజీగా ఉంటూ మరోవైపు ఇన్ని అదనపు బాధ్యతలు మోస్తున్నారు. 

అడిషనల్ కలెక్టర్​గాజిల్లాలో ఏడాది కాలంగా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన రాహుల్ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్​గా ట్రాన్స్​ఫర్ అయ్యారు. ఆ తర్వాత ఈ పోస్టులో ఎవరినీ  నియమించలేదు. అప్పటినుంచి కలెక్టర్ కుమార్ దీపక్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్​గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీలు,  మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలన వ్యవహారాలను లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. ఇంతటి కీలక పోస్టు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

అంతేకాకుండా నిరుడు  జనవరిలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అలాగే జూలైలో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు పూర్తయ్యింది. దీంతో జడ్పీ స్పెషల్ ఆఫీసర్, మంచిర్యాల కార్పొరేషనన్​తో పాటు మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్​గానూ బాధ్యతలు మోస్తున్నారు.  ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలను పర్యవేక్షించడం కలెక్టర్​కు భారంగా మారుతోంది. జిల్లాలో రెవెన్యూ వ్యవహారాలతో పాటు సివిల్ సప్లై తదితర శాఖలను పర్యవేక్షించే మరో కీలకమైన అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పోస్ట్ సైతం ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన మోతీలాల్ గత నెలలో రిటైర్ అయ్యారు. నెల రోజులు కావస్తున్నా ఈ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో  రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గానూ అదనంగా బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. పరిపాలన వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్​కు ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు కుడి, ఎడమ భుజాలుగా పనిచేస్తారు. ఇంతటి కీలకమైన పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం, కలెక్టర్​కే అదనపు బాధ్యతలను అప్పగించడంతో జిల్లా పరిపాలనపై ప్రభావం చూపుతోంది. 

పలు శాఖలకు ఇన్​చార్జీలు కూడా.. 

జిల్లాలో వివిధ శాఖలకు రెగ్యులర్ హెచ్​వోడీలు లేకపోవడంతో వారి స్థానంలో పలువురు అధికారులు ఇన్​చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ డెవలప్​మెంట్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, బీసీ డెవలప్​మెంట్ ఆఫీసర్, వైద్య విధాన పరిషత్ అధికారి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్​మెంట్ ఏడీ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అదనపు భారం

కుమార్ దీపక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. గతంలో ఇదే జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేయడంతో జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆ అనుభవంతో మెరుగైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ అదనపు బాధ్యతలు భారంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ.. మరోవైపు నిత్యం ఫీల్డ్ విజిట్,  మీటింగులు, ప్రజాప్రతినిధులు,  అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కడా ఇబ్బంది కాకుండా చర్యలు చేపడుతున్నారు. 

ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలు ఇతర కార్యక్రమాలతో ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడే వరకు బిజీగా గడుపుతున్నారు. జిల్లా పరిపాలన మరింత సాఫీగా సాగాలంటే కీలకమైన అడిషనల్ కలెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.