- మేయర్ సీటు టార్గెట్గా పావులు కదుపుతున్న వైనం
- టికెట్ల కోసం లీడర్ల నడుమ పోటీ.. జోరుగా పైరవీలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్కార్పొరేషన్పై మూడు ప్రధాన పార్టీలు పోకస్పెట్టాయి. ఎన్నికల్లో బల్దియాపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కార్పొరేషన్లో గెలిస్తే జిల్లా కేంద్రంపై పట్టు సాధించవచ్చని, తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బలం కలిసివస్తుందని భావిస్తున్నాయి. గతంలో మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల నిరుడు జనవరిలో కార్పొరేషన్గా ఆవిర్భవించింది. పక్కనున్న నస్పూర్మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు గ్రామపంచాయతీలను ఇందులో విలీనం చేసిన విషయం తెలిసిందే.
దీంతో నగర పరిధి భారీగా విస్తరించడమే కాకుండా ఓటర్ల సంఖ్య లక్షా 81 వేలకు చేరింది. మంచిర్యాల సెగ్మెంట్లో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు మూడో వంతు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు. ఈ కారణంగా మున్సిపల్ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్ అన్ని పార్టీలకు కీలకంగా మారింది.
అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ ముందుకు..
మున్సిపల్ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 67 వేల భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కార్పొరేషన్లో గెలిగి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. గత రెండేండ్లలో తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందనే దీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లను మెరుగుర్చారు. రూ.11 కోట్లతో గోదావరి రోడ్లో ఆధునిక వసతులతో మహాప్రస్థానం నిర్మించారు. మంచిర్యాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.255 కోట్లతో రాళ్లవాగు కరకట్ట మంజూరు చేయించారు.
ఆ పనులు స్పీడ్గా సాగుతున్నాయి. మార్కెట్ఏరియాలో రోడ్ల వెడల్పు చేపట్టడంతో పాటు రూ.76 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్కేబులింగ్ సిస్టమ్ సాంక్షన్ చేయించారు. ఐబీలో రూ.350 కోట్లతో సూపర్స్పెషాలిటీ హాస్పిటల్, ఎంసీహెచ్నిర్మాణం చేపడుతున్నారు. లక్ష్మీ టాకీస్నుంచి రాళ్లవాగు మీదుగా సిక్స్ లేన్ రోడ్డు, రాళ్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి శివారులో 250 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్కు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో మీటింగులునిర్వహిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు.
పావులు కదుపుతున్న బీజేపీ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అమలు కాని హామీలను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ లీడర్ల భూ కబ్జాలు, బెదిరింపులు, దాడుల నేపథ్యంలో ప్రజలు అధికార పార్టీపై విసుగుచెందారని, ఆ వ్యతిరేకతను వాడుకొని మున్సిపల్ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 40 వేల ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచింది. గత రెండేండ్లలో అర్బన్ఏరియాలో తమ పార్టీ మరింత బలం పుంజుకుందని కమలనాథులు భావిస్తున్నారు. అదే ఉత్సాహంతో సరైన అభ్యర్థులను బరిలోకి దించి బల్దియాపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమంటున్నారు. కార్పొరేషన్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ ఈసారి మున్సిపల్ఎన్నికల్లో గెలిచి పూర్వవైభవం చాటుకోవాలని తహతహలాడుతోంది. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాపై గులాబీ జెండా ఎగిరింది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోగానే ఆ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు కారు దిగి హస్తానికి జైకొట్టారు. దీంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అవిశ్వాస తీర్మానం ద్వారా బీఆర్ఎస్ను గద్దె దించి బల్దియాను హస్తగతం చేసుకున్నారు. దాంతో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది.
టికెట్ల కోసం పోటాపోటీ
మున్సిపల్ఎన్నికల్లో టికెట్ల కోసం లీడర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ వస్తే సగం గెలుపు ఖాయమైనట్టేనని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురు, నలుగురు ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలోనూ పలు డివిజన్లలో టికెట్ల కోసం పోటీ ఉంది. దీంతో ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తున్నారు. అన్ని పార్టీలు సర్వేల ద్వారానే గెలుపు గుర్రాలను బరిలోకి దించుతామని పేర్కొనడంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని లీడర్లు టెన్షన్ పడుతున్నారు.
