- పూర్తయిన ఇండ్లను పంచుతలేరు
- పూర్తయినవి పంచడంలో తాత్సారం
- విసిగిపోయి ఆక్రమించుకున్న పేదలు
- ఖాళీ చేయించేందుకు ఆఫీసర్ల తంటాలు
మంచిర్యాల,వెలుగు: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నాయి. కానీ పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు మంజూరైనవే తక్కువ ఇండ్లు కాగా వాటి నిర్మాణాలు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ కాస్ట్ గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిన వాటిలో కరెంట్, వాటర్, రోడ్లు వంటి చిన్న చిన్న పనులను పెండింగ్ పెట్టారు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో, తమకు ఇండ్లు ఎప్పుడు వస్తాయోనని పేదలు ఎదురుచూస్తున్నారు. పట్టణాల్లో కూలినాలి చేసుకునే చాలామంది వేలల్లో ఉన్న ఇంటి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఐదేండ్లు అవుతున్నా...
జిల్లాకు 2416 డబుల్ బెడ్రూమ్లు మంజూరయ్యాయి. 2017లో పనులు ప్రారంభించారు. ఇందులో 1044 నిర్మాణాలు పూర్తి కాగా, 806 పనులు కొనసాగుతున్నాయి. మరో 116 పనులు ప్రారంభించాల్సి ఉండగా, 450 ఇండ్లకు పరిపాలన అనుమతులు రావాల్సి ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్నగర్లో 650 డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నారు. రెండు దశల్లో 260 ఇండ్లు పూర్తి కాగా, స్థల వివాదం, కోర్టు కేసులతో 48 ఇండ్లు నిలిచిపోయాయి. మిగతా పనులు నత్తనడనక కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు స్థలాలు కోల్పోయిన 30 మందికి మాత్రమే డబుల్ ఇండ్లు కేటాయించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీకి కేవలం 160 ఇండ్లు మంజూరు కాగా, పనులు స్లోగా జరుగుతున్నాయి. మరో 400 ఇండ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో డబుల్ ఇండ్ల పనులు తుది దశకు చేరాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, వాటర్ సప్లై వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి కావాల్సి ఉంది. చెన్నూర్లో 2019లో పనులు ప్రారంభించినా ఇంకా పునాదులు, పిల్లర్ల దశలోనే మగ్గుతున్నాయి. ఇక్కడ 300 డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నారు. నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో టెండర్ల దశలోనే ఆగిపోయాయి. నియోజకవర్గానికి 4వేలకు పైగా ఇండ్లు మంజూరు చేసినట్టు ప్రకటించినా ఇంతవరకు వాటి జాడ లేకపోవడం గమనార్హం.
