- గోదావరి మొత్తంలో ఇక్కడే ఎక్కువ పాపులేషన్
- సందర్శించిన మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ప్రతినిధులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం అభయారణ్యం పరిధిలోని గోదావరిలో గల ఎల్ మడుగు మొసళ్లకు ఆవాసంగా విలసిల్లుతోంది. ఇక్కడ వందకు పైగా మొసళ్లు ఉన్నట్టు ఫారెస్ట్ అధికారులు అంచనాకు వచ్చారు. ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్న క్రొకొడైల్ సెన్సస్లో భాగంగా ది మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ఫౌండర్ ట్రస్టీ గణేశ్ ముత్తయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ షఫీక్ అహ్మద్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి రాజశేఖర్, చెన్నూర్ ఇన్చార్జి ఎఫ్ఆర్వో పోలోగి ప్రభాకర్ శనివారం ఎల్ మడుగును సందర్శించారు. ప్రిలిమినరీ సర్వే నిర్వహించారు. ఇక్కడి భౌగోళిక స్వరూపం, మొసళ్ల ఆవాసాలు, సమస్యలపై అధ్యయనం చేశారు.
మొసళ్ల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు..
ఎల్ మడుగును మొసళ్ల సంరక్షణ కేంద్రంగా గుర్తించాలని 1972లో అప్పటి పీసీసీఎఫ్ పుష్పకుమార్ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. ఈ మేరకు ప్రభుత్వం 1978లో దానిని మొసళ్ల సంరక్షణ, పునరావాస కేంద్రంగా ప్రకటించింది. చుట్టూ ఎత్తైన కొండలు, రాతి పలకలతో గోదావరిలో సహజ సిద్ధంగా ఎల్ మడుగు ఏర్పడింది. ఇది తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండగా, ఏడు కిలోమీటర్లు కోర్, రెండు కిలోమీటర్లు బఫర్ ఏరియాతో విస్తరించింది. దాదాపు 20 మీటర్ల లోతు ఉంటుంది. రాతి పలకలపై ప్రవహించే నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఏదాడి పొడవునా నిండుకుండను
తలపిస్తోంది.
గోదావరి మొత్తంలో ఇక్కడే ఎక్కువ..
నాసిక్ నుంచి బంగాళాఖాతంలో కలిసే గోదావరి మొత్తంలో ఎల్ మడుగులోనే మొసళ్ల పాపులేషన్ అధికంగా ఉందని అధికారులు తెలిపారు. పూర్తిగా రాతి పలకలతో ఏర్పడిన ఎల్ మడుగు వాటి ఆవాసానికి అనుకూలంగా ఉన్నట్టు పలు అధ్యయనాల్లో రుజువైంది.
మడుగులో పెరిగే చేపలను తింటూ ఉదయం, సాయంత్రం వేళల్లో రాతి పలకలపైకి వచ్చి సేదతీరుతుంటాయి. 2015–-16లో నిర్వహించిన క్రొకొడైల్ సెన్సన్లో ఇక్కడ 60కి పైగా మొసళ్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య వందకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మగ్గర్ జాతి మొసళ్ల జీవితకాలం సుమారు 70 ఏండ్లు కాగా, 3 నుంచి 3.5 మీటర్ల పొడవు, 150 నుంచి 200 కేజీల బరువు ఉంటాయి. ఏటా ఫిబ్రవరి, మార్చిలో రాతి పలకలు, ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి పొదుగుతాయి. జూన్, జులైలో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఒక్కో మొసలి దాదాపు 30 గుడ్లు పెడుతుందని ఎఫ్ఆర్వో ప్రభాకర్ తెలిపారు. ఎల్ మడుగులో మొసళ్లతో పాటు 60కి పైగా నీటి కుక్కలు ఉన్నాయని చెప్పారు.
టూరిస్టులను ఆకట్టుకుంటున్న అభయారణ్యం..
శివ్వారం అభయారణ్యం ఎకో టూరిస్టులను, నేచర్ లవర్స్ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ అరుదైన నక్షత్ర తాబేళ్లు, పగడాల జెర్రిలు, చుక్కల దుప్పులు, నీలుగాయిలు, మనువోతులు, నెమళ్లు, అడవి కోళ్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఫారెస్టు అధికారులు ఎల్ మడుగును టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేశారు. టూరిస్టులు బోట్లో విహరిస్తూ రాతి పలకలపై నోరు తెరిచి సేదతీరుతున్న మొసళ్లను చూసి మైమరిచిపోతారు. గోదావరి ఒడ్డున ఉన్న గుట్టపై గల వ్యూ పాయింట్ నుంచి చూస్తే నలుదిక్కులా కనుచూపు మేరలో పచ్చని ప్రకృతి ఆహ్లాదం కలిగిస్తుంది. పురాతన గుళ్లు, ట్రెక్కింగ్ మర్చిపోలేని అనుభూతిగా మిగులుతుంది.
