
అచ్చంపేట, వెలుగు: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని దేశంలోని కొందరు అహంకారులు, నియంతలే వ్యతిరేకిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థపాక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, దళిత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో తెలివితక్కువ సీఎంలలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యలతో రుజువైందన్నారు. రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదని, ఆర్టికల్167 ద్వారా మార్చుకోవచ్చని చెప్పారు. ఇందిరాగాంధీ, మోడీలాంటి వారు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను పొగిడారని, కానీ కేసీఆర్ లాంటి నియంతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ క్షమాపణ చెప్పకపోతే మార్చి 4న హైదరాబాద్లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.