- కేసీఆర్ మాటల్నిదళితులు నమ్మరు
- ఏడేండ్ల మోసం.. ఎట్ల మర్చిపోతం: మందకృష్ణ
- దళితులతో విందు భోజనాలు పెద్ద డ్రామా
- 100 రోజుల్లో రాష్ట్రమంతా దళిత బంధు ఇయ్యాలే
- దళిత హామీలపై 48 గంటల్లోగా సీఎం స్పందించాలని డిమాండ్
- కేసీఆర్.. కల్లబొల్లి మాటలు ఆపు: అద్దంకి దయాకర్
- కుట్రలతో ఆగం చేయాలని చూస్తే ఖబడ్దార్: రాములు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ కుటుంబాలన్నింటికీ 100 రోజుల్లో దళిత బంధు ఇవ్వాలని ఎస్సీల సమగ్ర అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా ఈ స్కీంను అమలు చేయాలంది. మాయమాటలతో మభ్య పెడుతామంటే సహించేది లేదని హెచ్చరించింది. కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో దళిత సంఘాలు, మేధావుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ప్రెసిడెంట్ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ నిన్నెందుకు నమ్మాలి? దళితులకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చనందుకా? అసలే నమ్మం. ఏసీ బస్సులో తీసుకొచ్చి, పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేస్తే ఏడేండ్లుగా చేసిన మోసాలను మర్చిపోవాలా? దళిత సమాజాన్ని మోసం చేస్తున్నది.. అస్థిత్వాన్ని చంపుతున్నది.. ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తున్నది.. అభివృద్ధిని అడ్డుకున్నది మీరు కాదా? దళితులకు పంచిన భూమి గోరంత లేదు. కానీ లాక్కున్న అసైన్డ్ భూములు కొండంత. ఇందుకా మిమ్మల్ని నమ్మాలి?’’ అని మండిపడ్డారు. కేసీఆర్ మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ దళితులు నమ్మరని చెప్పారు. దళితులతో విందు భోజనాలు పెద్ద డ్రామా అని, దళితులను భ్రమల్లోకి నెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దళితులకు భూములు, ఆత్మగౌరవ భవనాలు ఇవ్వకుండా చిన్నచూపు చూసిన రాష్ట్ర సర్కార్.. ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తూ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. ‘‘హైటెక్ సిటీలో కమ్మ, వెలమలకు భూములు ఇచ్చిన చోటే ఎస్సీ ఉప కులాలకు ఎకరా చొప్పున ఇవ్వాలి. సీఎం కేసీఆర్ది వంచించే చరిత్ర. జీహెచ్ఎంసీలో రూ. 10 వేలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రూ.10 లక్షలు ఎట్ల ఇస్తరు. విందు భోజనాలతో హామీలను విస్మరిస్తామంటే మాయలో పడేందుకు దళితులు సిద్ధంగా లేరు. బైపోల్ నోటిషికేషన్ కంటే ముందే స్కీం అమలు చేయకపోతే 10 లక్షల మందితో హుజూరాబాద్లో సింహగర్జన నిర్వహిస్తాం. 100 మందితో ఉమ్మడి ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం” అని మందకృష్ణ హెచ్చరించారు. ‘‘కేసీఆర్ టైమ్కు ఎంతైనా నమ్మిస్తడు. టైమ్దాటితే మోసం చేస్తడు. కేసీఆర్ను ఓడించడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రధాన శత్రువు కేసీఆరే’’ అని చెప్పారు. అన్ని రంగాల్లో దళితులకు 18 శాతం నిధులు, నియామకాలు కేటాయించాలని, మంత్రి వర్గంలో కనీసం ముగ్గురు ఎస్సీ మంత్రులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత హామీలపై 48 గంటల్లోగా సీఎం స్పందించాలని, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంద కృష్ణ హెచ్చరించారు. సమావేశంలో వివిధ దళిత సంఘాల నేతలు జేబీ రాజు, జి. శంకర్, రాములు, పి. శంకర్, రాజలింగం, వీరేశం, దుర్గం భాస్కర్, బత్తుల రాంప్రసాద్, డాక్టర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
మూడెకరాల భూమి పంచాల్సిందే: రాములు
ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో 15 శాతం కూడా ఖర్చు చేయడం లేదని బీజేపీ నేత, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు ఆరోపించారు. కుట్ర చేసి ఎస్సీలను చీల్చాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు చేసి, ఆగం చేయాలని చూస్తే కేసీఆర్కు గోరీ కడతామని హెచ్చరించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాల్సిందేనన్నారు. దళిత బంధు హామీ నెరవేర్చకపోతే కేసీఆర్ను గద్దె దింపుతామని ప్రొఫెసర్ గాలి వినోద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ మహిళల కోసం 50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కోడ్ లోపు అమలు చేయకపోతే ఓడిస్తం: అద్దంకి దయాకర్
దళిత బంధు పథకం కోసం లక్ష కోట్ల బడ్జెట్ పెడతామంటున్న సీఎం కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మడం లేదని తెలంగాణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. ఎన్నికల కోడ్ లోపే దళిత బంధు అమలు చేస్తేనే హర్షిస్తామని, లేకుంటే హుజూరాబాద్లో ఓడిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దళిత నేతలను దళిత బంధుకు వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు సొంత అజెండాలు లేవని చెప్పారు. గతంలో చేసిన మోసాలతో కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలు ఆపి, జీఓలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.