కామారెడ్డి, వెలుగు: చిన్నమ్మ వరుసయ్యే ఓ మహిళతో యువకుడు సహజీవనం చేస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన తన అన్నను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్పల్లిలో జరిగింది. భిక్కనూరు ఎస్సై అంజనేయులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మోటాట్పల్లికి చెందిన ఎర్ర నరసయ్యకు ఇద్దరు కొడుకులు రాజు, శివకుమార్ ఉన్నారు. శివకుమార్ వరుసకు చిన్నమ్మ అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను రెండేళ్ల క్రితం గ్రామం నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి సహజీవనం చేస్తున్నాడు.
ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలో రాజు, శివకుమార్ మధ్య గొడవ జరిగింది. శనివారం ఉదయం రాజు(32) మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. శివకుమార్ బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ సంపత్కుమార్, ఎస్సై అంజనేయలు పరిశీలించారు. ఈ ఘటనపై వివిధ కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. శివకుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
