
- మెడికల్ కాలేజీలకు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వద్ద కోర్సు మొత్తానికి ఒకేసారి ఫీజు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఫీజు రెగ్యులేటరీ కమిటీ హెచ్చరించింది. ఏ ఏడాది ఫీజును ఆ ఏడాది మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నరేండ్లు మాత్రమేనని, ఇందుకు తగ్గట్టుగానే ఫీజు తీసుకోవాలని సూచించింది. కొన్ని కాలేజీలు ఐదేండ్లకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి స్పష్టతను ఇస్తున్నామని తెలిపింది.
కోర్సు ఫీజు ఏడాదికి రూ.14.5 లక్షలు ఉంటే మొత్తం నాలుగున్నరేండ్లకు కలిపి రూ.65.25 లక్షలు మాత్రమే తీసుకోవాలని చెప్పింది. ఈ మొత్తాన్ని 5 ఇన్స్టాల్మెంట్లలో విద్యార్థుల నుంచి తీసుకోవాలని, ఒక్కో ఇన్స్టాల్మెంట్కు రూ.13.05 లక్షలు మాత్రమే చార్జ్ చేయాలని సూచించింది.