షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం.. మంగళగిరి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం.. మంగళగిరి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ని ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. తన నియోజకవర్గానికి సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  సొంత డబ్బులు ఖర్చు పెట్టి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి  ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. 

 డిసెంబర్ 30వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.  షర్మిల తన రాజకీయాలపై నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తానని.. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే  నడుస్తానని తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని.. పొమ్మనలేక పొగ పెట్టారని దుయ్యబట్టారు. ప్రజల తరుపునే తాను పోరాడుతానని..  సీఎం జగన్ ఏవైనా తప్పులు చేస్తే..  అవసరమైతే ఆయనపై కేసులు వేస్తా-నని రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.