
- వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు
- మైనింగ్ కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ
- వచ్చే నెల ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటుకు సర్కారు వేగంగా చర్యలు తీసుకుంటుంది. కాకతీయ యూనివర్సిటీ కింద కొత్తగూడెంలో మైనింగ్ ఇంజనీరింగ్కాలేజీ కొనసాగుతోంది. ఈ కాలేజీనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్ గ్రేడ్చేస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 20 జారీ చేసింది. దీనికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ గా నామకరణం చేశారు. వైస్ ఛాన్స్లర్గా ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్సెక్రటరీ యోగితారాణాకు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టులో యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలోనే మొట్ట మొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ
సింగరేణి గనులకు పుట్టినిల్లయిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1956లో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆధీనంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1976లో సింగరేణి కాలరీస్కంపెనీ సహకారంతో పీజీ కోర్సును ప్రారంభించారు . 1994లో ఈ కాలేజీ కాకతీయ యూనివర్శిటీ పరిధిలోకి వెళ్లింది. కొత్తగూడెం, పాల్వంచ సరిహద్దులోని ఈ కాలేజీలోనే ఏర్పాటవుతున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ నిర్వహణకు జిల్లా అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో అపారమైన ఖనిజాలున్నాయి.
నేషనల్ హైవేకి దగ్గరలో దాదాపు 300 ఎకరాల్లో యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ఇక్కడికి దగ్గరలోనే కేటీపీఎస్, ఫెర్రో ఎల్లాయిస్, నవభారత్, ఫెర్రో మెగ్నీషియం, సింగరేణి మైన్స్ఉన్నాయి. సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డు, మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్, బీటీపీఎస్ ఉన్నాయి. కొత్తగూడెం వరకు రైలు మార్గం ఉంది. యూనివర్శిటీ కాలేజీలో ప్రస్తుతం బీటెక్లో మొదటి దశ అడ్మిషన్లు జరిగాయి. ఇక్కడ సీఎస్సీ, ఐటీ, ఈఈఈ, ఈసీఈ, మైనింగ్ బ్రాంచీలుండగా.. ఒక్కో దాంట్లో 60 సీట్లు కేటాయించారు. మొత్తం 300 సీట్లకు గానూ ఇప్పటివరకు 160సీట్లు భర్తీ అయ్యాయి.
అందుబాటులోకి రానున్న కోర్సులు
ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులతో పాటు అదనంగా నాలుగు యూజీ, నాలుగు పీజీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సుల్లో మొదటి దశ అడ్మిషన్లు చేపట్టేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దోస్త్ ఫైనల్ ఫేజ్కింద యూజీ కోర్సుల అడ్మిషన్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, మినరల్స్తదితర కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
ఏర్పాట్లను పరిశీలించనున్న తుమ్మల
అగ్రికల్చర్ మినిష్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇంచార్జి వీసీ యోగితారాణా , ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఇతర అధికారులతో కలిసి బుధవారం ఇక్కడికి రానున్నారు. యూనివర్శిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, బిల్డింగ్స్, ల్యాబ్స్తదితర సౌకర్యాలను పరిశీలించనున్నారు. అవసరమైన ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువ సైంటిస్ట్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.