‘పోడు భూముల’ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ కీలక నిర్ణయం

‘పోడు భూముల’ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ కీలక నిర్ణయం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన‌ కేబినెట్ భేటీలో పలు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల విషయంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలతో పాటు జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో.. ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది.

దళితబంధు పథకం విస్తరణ
ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని అందిస్తున్నారు.100 మంది లబ్ధిదారులతో పాటు మరో 500 మందికి కూడా దళిత బంధు పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఇదే విధానాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న నేపథ్యంలో మిగిలిన 118 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

కేబినెట్ లో కీలక నిర్ణయాలు 
• జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం.  జీహెచ్ఎంసీలో 5 నుండి 15 వరకు, ఇతర కార్పొరేషన్లలో 5 నుండి 10 వరకు కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానం.

• రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్ట్ యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరు చేయాలని తీర్మానం.

• సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగు పరచాలని నిర్ణయం. అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయం. ఇందుకోసం రూ.2214.79 కోట్లను  మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం.

• రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాల కోసం 21జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని తీర్మానం. 

• భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని నిర్ణయం.