హైదరాబాద్, వెలుగు : సమాజంలో ఎప్పటికీ నిలిచి ఉండేది పాట మాత్రమేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘కాలం గుండె చప్పుడు’ ఏర్పాటై ఐదేళ్లు అయిన సందర్భంగా బంజారాహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్లో సోమవారం కవి సంగీతం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రజాగాయకుడు గద్దర్ కు నివాళి అర్పించారు. ఇందులో భాగంగా రచయితలు శక్తి, విమల, సుధాకిరణ్, బొగ్గారపు వెంకన్న అరుణోదయ నాగన్న రాసిన ఐదు పాటలను వీడియో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమానికి డైరెక్టర్ బి.నర్సింగరావు, ప్రొఫెసర్ చింతకింది
కాసిం, కె. శ్రీనివాస్, యోచన, అరుణ భీమిరెడ్డి తదితరులు హాజరై ‘పాటొక్కటే మిగులుతుంది’ బుక్ ను రిలీజ్ చేశారు. వక్తలు మాట్లాడుతూ .. రచయితల పాటల గొప్పతనం గురించి కొనియాడారు. పాటలను కాలం గుండె చప్పుడు ద్వారా వీడియో రూపంలోకి తీసుకొచ్చిన సురేశ్ లెల్లను అభినందించారు. అనంతరం శక్తి, అరుణోదయ నాగన్నను సన్మానించారు. కార్యక్రమంలో తాడి ప్రకాశ్ సమన్వయ కర్తగా వ్యవహరించగా, శ్రీను మైత్రి, ఎర్రా నర్సారెడ్డి, శరత్ నలిగంటి, జిలుకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.