లొంగిపోయిన ద్రోహుల వల్లే ఎన్ కౌంటర్.. నంబాలను కాపాడేందుకు 35 ప్రాణాలు అడ్డుపెట్టారు: మావోయిస్టు పార్టీ

లొంగిపోయిన ద్రోహుల వల్లే ఎన్ కౌంటర్.. నంబాలను కాపాడేందుకు 35 ప్రాణాలు అడ్డుపెట్టారు: మావోయిస్టు పార్టీ

హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో భద్రత దళాల చేతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేరుతో సోమవారం (మే 26) అఫిషియల్‎గా రిలీజ్ చేసిన లెటర్‎లో.. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలోని గుండెకోట్ అడవిలో 2026, మే 21 జరిగిన ఎన్ కౌంటర్లో నంబాల మృతి చెందారని ధృవీకరించారు. 

ఆయనతో పాటు మరో 28 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించారు. 6 నెలలుగా కేశవరావు మాడ్‌ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు. ఇటీవల కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు లొంగిపోయారు.. ఆ ద్రోహుల ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని తెలిపారు. నంబాల భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న సీవైపీసీ సభ్యులు కూడా ద్రోహానికి పాల్పడ్డ వారిలో ఉన్నారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా దేశద్రోహిగా మారాడు. 

దీంతో భద్రతా దళాల పని సులువైంది. రీకితో సహా ఈ దేశ ద్రోహులందరూ కూడా ఈ ఆపరేషన్‎లో పాల్గొన్నారు. ఈ ద్రోహుల కారణంగానే మనం ఇంత పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. మే 19న నంబాల ఉన్న సమీప గ్రామానికి పోలీసు బృందం చేరుకుందని సమాచారం అందిన తర్వాత ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బయలుదేరాం. 19వ తేదీ ఉదయం నుంచి ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి కానీ ఎటువంటి నష్టం జరగలేదు. -మే 20 రాత్రి వేలాది మంది పోలీసు బలగాలు వారిని చుట్టుముట్టాయి. 60 గంటల పాటు భద్రత దళాలు తమను నిర్భంధించాయి.

కేశవరావును  సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదు. ముందుండి మమ్మల్ని నడిపించారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. కానీ మే 21న జరిగిన ఆపరేషన్‌లో నంబాలతో పాటు 28 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డాం. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదు. పాకిస్థాన్‎తో కాల్పులు విరమణ చేసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి.. మాతో శాంతి చర్చలు జరిపే సమయం లేదని అసహనం వ్యక్తం చేసింది.