- జీఎస్టీ వచ్చాక సెకెండ్ హయ్యస్ట్ 13 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మార్చి నెలలో రూ.1.60 లక్షల కోట్లకు పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 13 శాతం పెరుగుదల. అంతేకాకుండా మార్చి కలెక్షన్స్ సెకెండ్ హయ్యస్ట్ కావడం విశేషం. కిందటేడాది ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ‘కిందటి నెలలో వస్తువుల దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 8 శాతం ఎక్కువగా జరిగాయి. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ల (సర్వీస్ల ఇంపోర్ట్స్ కలిపి) నుంచి వచ్చే రెవెన్యూ 14 శాతం ఎక్కువగా ఉంది’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
మార్చి నెలలో మొత్తం రూ.1,60,122 కోట్లు జీఎస్టీ కింద వసూళ్లయ్యాయని వివరించింది. ‘ఇందులో రూ.29,546 కోట్లు సెంట్రల్ జీఎస్టీ నుంచి, రూ. 37,314 కోట్లు స్టేట్ జీఎస్టీ నుంచి, రూ.82,907 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో వస్తువుల దిగుమతులపై సేకరించిన రూ.42,503 కోట్లు కలిసి ఉన్నాయి. సెస్ కింద మరో రూ.10,355 కోట్లు వచ్చాయి’ అని పేర్కొంది. జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్లో కూడా మార్చిలో రికార్డ్ క్రియేట్ అయ్యిందని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఇన్వాయిస్ స్టేట్మెంట్లలో జీఎస్టీఆర్ –1 కింద 93.2 % రిటర్న్స్ ఫైల్ అయ్యాయని పేర్కొంది.
2022– 23 లో రూ.18 లక్షల కోట్లు..
2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.18.10 లక్షల కోట్ల రెవెన్యూని జీఎస్టీ కింద ప్రభుత్వం పొందింది. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. 2022–23 ఆర్థిక సంవత్సరంలో యావరేజ్గా ఒక నె లలో రూ.1.51 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. మార్చి నెలను కలుపుకుంటే కిందటి ఆర్థిక సంవత్సరంలో నాలుగో సారి జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల మార్క్ను క్రాస్ చేశాయి.
జనవరి – మార్చి క్వార్టర్లో సగటును నెలకు రూ.1.55 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చిందని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. కిందటేడాది ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో సగటున నెలకు రూ.1.51 లక్షల కోట్లు, జులై – సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 1.46 లక్షల కోట్లు, అక్టోబర్ – డిసెంబర్ లో రూ.1.49 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూళ్లయ్యాయని వివరించింది.
తెలంగాణ నుంచి రూ. 4,804 కోట్లు
ఈ ఏడాది మార్చిలో రాష్ట్రం నుంచి రూ.4,804 కోట్లు జీఎస్టీ కింద వసూళ్లయ్యాయి. కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ రూ.4,242 కోట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 13.25 % గ్రోత్ను నమోదు చేశాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జీఎస్టీ వసూళ్లు 11.26 % పెరిగి రూ.3,174 కోట్ల నుంచి రూ.3,532 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ ఎక్కువగా మహారాష్ట్ర (రూ.22,695 కోట్లు), కర్నాటక (రూ.10,360 కోట్లు), తమిళనాడు (రూ.9,245 కోట్లు) నుంచి వచ్చాయి.