న్యూఢిల్లీ: వరుసగా రెండో సెషన్లోనూ సెన్సెక్స్, నిఫ్టీ కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. సెన్సెక్స్ 48 పాయింట్లు (0.07 శాతం) తగ్గి 65,970 దగ్గర ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్లు పడి 19,795 దగ్గర సెటిలయ్యింది. వారం ప్రాతిపదికన చూస్తే బీఎస్ఈ సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు లాభపడ్డాయి.
సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా పడ్డాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా పెరిగాయి. టోక్యో మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగియగా, సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్గా కదిలాయి.
ఫారెక్స్..
ఈ నెల 17 తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 5.08 బిలియన్ డాలర్లు పెరిగి 595.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 462 మిలియన్ డాలర్లు తగ్గి 590.321 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ఈ నెల 17 తో ముగిసిన వారంలో ఫారెన్ కరెన్సీ అసెట్స్ 4.387 బిలియన్ డాలర్లు పెరిగి 526.391 బిలియన్ డాలర్లకు, గోల్డ్ రిజర్వ్లు 527 మిలియన్ డాలర్లు పెరిగి 46.042 బిలియన్ డాలర్లకు ఎగశాయి.