కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రి పురురవరెడ్డి 

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రి పురురవరెడ్డి 

తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు పురురవ రెడ్డి  హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష  నిర్ణయాల కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని పురురవ రెడ్డి  చెప్పారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో విసిగిపోయానని అందుకే రిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశమే లేదని పేర్కొన్నారు. 

ఇటీవల పురురవ రెడ్డి తండ్రి సీనియర్​ రాజకీయ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆధ్వర్యంలో మర్రి శశిధర్ రెడ్డి కమల దళంలోకి చేరారు.  ఈసందర్భంగా జేపీ నడ్డా బీజేపీ కండువా కప్పి మర్రి శశిధర్​ రెడ్డిని పార్టీలోకి స్వాగతం పలికారు.  తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నరు.. కానీ అది రాలేదని ఇటీవల శశిధర్ రెడ్డి అన్నారు.  మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతిమయ ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు.  మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని ... తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ఇలాంటి  ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు  సంతోషంగా ఉందన్నారు.  బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్న శశిధర్ .. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా  సిద్ధమేనన్నారు.