భద్రాద్రి ప్లాంటుపై పిడుగు..కాలిపోయిన జనరేటర్​ ట్రాన్స్​ఫార్మర్​

భద్రాద్రి ప్లాంటుపై పిడుగు..కాలిపోయిన జనరేటర్​ ట్రాన్స్​ఫార్మర్​
  •     కాలిపోయిన జనరేటర్​ ట్రాన్స్​ఫార్మర్​ 
  •     రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా డ్యామేజీ?
  •     ఘటనా స్థలంలో కార్మికులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్  కేంద్రం(బీటీపీఎస్) లో శనివారం రాత్రి పిడుగు పడి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీటీపీఎస్​లోని మొదటి యూనిట్ కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్ పై ఒక్కసారిగా పిడుగు పడడంతో ట్రాన్స్ ఫార్మర్  పేలిపోయి మంటలు వ్యాపించాయి. మొదటి యూనిట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తును జనరేటర్  ట్రాన్స్​ఫార్మర్  ద్వారా స్విచ్ యార్డుకు పంపిస్తారు. జనరేటర్  ట్రాన్స్​ఫార్మర్ కు అగ్నిప్రమాదం జరగడంతో 270 మెగావాట్ల విద్యుత్  సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను షట్ డౌన్  చేశారు. 

ముందుజాగ్రత్తగా పక్కనే ఉన్న రెండో యూనిట్​ను కూడా  షట్​డౌన్​ చేశామని ఉద్యోగులు తెలిపారు. కాగా.. జనరేటర్  ట్రాన్స్ ఫార్మర్ కు అంటుకున్న మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్  వల్ల సాధ్యం కాకపోవడంతో డ్రై కెమికల్ పౌడర్​ వినియోగించారు. గంటన్నరపైగా ఫైర్  సిబ్బంది, ప్లాంటు ఉద్యోగులు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. పిడుగు పడిన టైంలో ఆ ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జనరేటర్  ట్రాన్స్ ఫార్మర్  కాలిపోవడంతో సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఉద్యోగులు పేర్కొన్నారు. 

లైట్నింగ్ అరెస్టు పనితీరుపై అనుమానాలు

బీటీపీఎస్​లోని జనరేటర్ ట్రాన్స్​ఫార్మర్ పై పిడుగు పడడంపై అధికారులతో పాటు కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్  కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, సబ్ స్టేషన్ల సమీపంలో పిడుగులు పడకుండా లైట్నింగ్​ అరెస్టులను (రాడ్) ఏర్పాటు చేస్తారు.  బీటీపీఎస్​లోనూ లైట్నింగ్​ అరెస్టులను ఏర్పాటు చేశామని ప్లాంట్​  అధికారులు పేర్కొంటున్నారు. లైట్నింగ్​ పనితీరుపై ఉద్యోగుల్లో  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్లాంటులో పిడుగులను అడ్డుకునే లైట్నింగ్​ల ఏర్పాటు, వాటి పనితీరు, పర్యవేక్షణ విషయంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం కనిపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జనరేటర్​ ట్రాన్స్​ఫార్మర్​పై పిడుగు పడడంతో 270 మెగావాట్ల యూనిట్ల​ఉత్పత్తి నిలిచిపోయింది. తిరిగి ఉత్పత్తి కావడానికి దాదాపు నెలకుపైనే పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

మంత్రి తుమ్మల ఆరా

ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీటీపీఎస్​ సీఈ బిచ్చన్న కు ఫోన్  చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తుమ్మలకు సీఈ వివరించారు. పిడుగుపాటును అడ్డుకునే లైట్నింగ్​ అరెస్టులు ఉన్నా ఇలా జరగడంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.