వనపర్తి జిల్లాలో కరెంటే లేని గోదామ్ ..​ షార్ట్​ సర్క్యూట్ తో కాలిందట

వనపర్తి జిల్లాలో కరెంటే లేని గోదామ్ ..​ షార్ట్​ సర్క్యూట్ తో కాలిందట
  • పెబ్బేరు మార్కెట్​ గోదామ్​ ప్రమాదంపై నివేదిక

వనపర్తి/పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్​ యార్డులోని గోదామ్​లో అగ్ని ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రత, షార్ట్​ సర్క్యూట్​కారణమని నివేదిక ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదామ్​లో విద్యుత్​ సప్లై లేకుండా షార్ట్​ సర్క్యూట్​ ఎలా జరుగుతుందని అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్​ 1న పెబ్బేరు అగ్రికల్చరల్​ మార్కెట్​ యార్డు గోదామ్​లో అగ్నిప్రమాదం జరిగింది. గోదామ్​లో మిల్లర్లు నిల్వ చేసుకున్న సీఎంఆర్​ వడ్లు, సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​కు చెందిన గోనె సంచులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 23 వేల బస్తాల వడ్లు, 12.85లక్షల గోనె సంచులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఇంటలిజెన్స్​ అధికారులు మార్కెట్​ యార్డులోని గోదామ్​లో అధిక ఉష్ణోగ్రత, షార్టు సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగినట్లు నివేదిక ఇచ్చారు.

గోదామ్​కు కరెంట్  మీటరే లేదు.. 

విచారణలో భాగంగా అధికారులు విద్యుత్​ శాఖ ఏఈని ఈ విషయంపై ఆరా తీయగా, గోదామ్​కు మీటరు లేదని చెప్పినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్​ అధికారులే గోదామ్​కు కరెంట్​ కనెక్షన్​ లేదని చెబితే.. కరెంటే లేని గోదామ్​లో షార్ట్​ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగిందని నివేదిక ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పథకం ప్రకారం ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరగడానికి మూడు రోజుల ముందు నుంచి గోదామ్​ వెనక ఉన్న ఒక కిటీకీ  తెరుచుకొని ఉన్నట్లు విజిట్​కు వచ్చిన ఆఫీసర్లు గుర్తించారు. ఇదేమని అప్పటి అడిషనల్​ కలెక్టర్​ ప్రశ్నించగా, గాలి కోసం తెరిచారని సమాధానం చెప్పినట్లు తెలిసింది. 

దీనిని బట్టి చూస్తే ఇదంతా పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 యాసంగి సీజన్​లో వడ్లను కొనేందుకు వనపర్తి జిల్లాలోని పెబ్బేరు గోదామ్​లో 12.85లక్షలు, గోపాల్​పేటలో 25.37లక్షలు, వనపర్తి మండలం చిట్యాల గోదామ్​లో 3.20 లక్షల చొప్పున గోనె సంచులను నిల్వ ఉంచారు. పెబ్బేరు గోదామ్​లో 7 లక్షల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అగ్నిప్రమాదం ఘటన జరగడం అనుమానాలు రేకెత్తించింది. అంతకు కొన్ని రోజుల ముందే ఉన్నతాధికారులు గోదామ్​ తనిఖీలో గన్నీ బ్యాగుల లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో సంబంధిత అధికారులను ఈ విషయమై నిలదీసి హెచ్చరించారు. ఇదిలాఉంటే అగ్నిప్రమాదంలో కాలిపోయిన గన్నీ బ్యాగులను ఇన్సూరెన్స్​ ఆఫీసర్లు పరిశీలించి అంచనా వేశారని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు చెబుతుండడం గమనార్హం.

నివేదిక ఇచ్చిన మాట వాస్తవమే..

పెబ్బేరు మార్కెట్​ యార్డు గోదామ్​ లో జరిగిన అగ్నిప్రమాదానికి అధిక ఉష్ణోగ్రత, షార్ట్​ సర్క్యూట్​ కారణమని విచారణాధికారులు నివేదిక ఇచ్చారు. కాలిపోయిన గోనె సంచులకు త్వరలోనే ఇన్సూరెన్స్  వస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు నేను జాయిన్​ కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియదు. వెంకటేశ్వర్లు, అడిషనల్​ కలెక్టర్