నేరెడ్మెట్, వెలుగు: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు తమను మోసం చేశారని మేడ్చల్ జిల్లా యాప్రాల్కు చెందిన శ్రవణ్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బాధితులు రాచకొండ సీపీ మహేశ్భగవత్కు సోమవారం కంప్లయింట్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన ఓ రాజకీయ నాయకుడు తమకు బంధువని చెప్పి పొన్నాల భాస్కర్, పొన్నాల సాయి యశ్వంత్, పళ్ల పరమేశ్వర్ రెడ్డి గ్యాంగ్ గా ఏర్పడి నిరుద్యోగులను టార్గెట్ చేశారన్నారు. గవర్నమెంట్ లెటర్లు, స్టాంప్ లు చూపించి రైల్వేలోని వివిధ కేటగిరీల్లో పర్మినెంట్ పోస్టులు ఇప్పిస్తామని 16 మంది నుంచి రూ.93 లక్షల 50 వేలు వసూలు చేశారన్నారు. 3 నెలల్లో జాబ్ రాకపోతే డబ్బులు వాపసు ఇస్తామని నమ్మించారన్నారు. ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్, ఐడీ కార్డులు చూపించి ఢిల్లీ, ముంబయి, లక్నో, కోల్ కతా, ముంబయి ప్రాంతాలకు తీసుకెళ్లారన్నారు. అపాయింట్ మెంట్ లెటర్లు ఫేక్ అని తేలడంతో మోసపోయినట్లు తెలుసుకున్నామన్నారు. భాస్కర్ ను కలిసి డబ్బులు ఇవ్వాలని అడిగితే హవాలాలో ఉందని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. సాయి యశ్వంత్, పరమేశ్వర రెడ్డి ఇండ్ల వద్దకు వెళ్తే వారు కనిపించలేదన్నారు. కాలనీ వాసులను ఆరా తీయగా సాయి యశ్వంత్, పరమేశ్వర్ రెడ్డి పరారైనట్లు తెలుసుకున్నామని.. వారికి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదని బాధితులు తెలిపారు. ఆడియో, వీడియో రికార్డ్స్, ఫేక్ డాక్యుమెంట్లు, లెటర్లతో రాచకొండ సీపీకి కంప్లయింట్ చేశామన్నారు. 2016 నుంచి భాస్కర్, యశ్వంత్, పరమేశ్వర్ ఇలాంటి మోసాలు చేస్తున్నారన్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమకు కంప్లయింట్ చేయాలని రాచకొండ పోలీసులు కోరారు.
మరిన్ని వార్తల కోసం