న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఏటా వీటికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–-23లో రెండున్నర రెట్లు పెరిగి 8,46,976 యూనిట్లకు చేరుకున్నాయి. సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) డేటా ప్రకారం.. 2021–-22లో మొత్తం 3,27,900 ఈ–-టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 25 కిలోమీటర్ల తక్కువ వేగంతో వెళ్లే లోస్పీడ్ ఈ-–-స్కూటర్లు1.2 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే ఈ–స్కూటర్లు 7,26,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–-22లో లో స్పీడ్ ఈ-–స్కూటర్ల అమ్మకాలు 75,457 యూనిట్లుగా ఉండగా, హై స్పీడ్ ఈ-–స్కూటర్లు 2,52,443 సేల్ అయ్యాయి. అయితే కిందటి ఆర్థిక సంవత్సరం అమ్మకాలు నీతి ఆయోగ్ సూచించిన టార్గెట్ కంటే 25 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఈవీల అమ్మకాలను పెంచడానికి ప్రభుత్వం ఫేమ్ స్కీమును చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టింది.
ఈ పథకం మార్గదర్శకాలను కంపెనీలు పాటించడం లేదంటూ రాయితీలను నిలిపివేసింది. దీంతో అమ్మకాలు తగ్గాయని సొసైటీ తెలిపింది. లోకల్గా పార్టులను తయారు చేయడం లేదంటూ ఇలా చేసిందని విమర్శించింది. కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు రూ. 1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అందించారని, ఈ డబ్బును ప్రభుత్వం వారికి చెల్లించడం ఆపేసిందని పేర్కొంది. కొన్ని కంపెనీలు ‘అండర్ ఇన్వాయిసింగ్’ చేశాయనే ఆరోపణల కారణంగా వాటికి రావాల్సిన రూ. 400 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ను నిలిపివేశారు. "ఈవీ పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు గందరగోళంలో ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి . ఫేమ్ పీఎంపీ ఇబ్బందులు తొలుగుతాయని భావిస్తున్నాయి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి”అని అసోసియేషన్ పేర్కొంది
టార్గెట్ను చేరుకోలే...
ఈవీ అమ్మకాలపై ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, "2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీల సంఖ్యను 30 శాతానికి పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నా ఇది 5 శాతం మించలేదు. 2030 నాటికి రోడ్లపై 80 శాతం బండ్లు కరెంటువే ఉండాలన్న టార్గెట్ను చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పీఎంపీ ఎలిజబిలిటీ క్రైటీరియాను రెండు సంవత్సరాలు పొడిగించాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వీటిని తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ఫేమ్ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం ఈవీ పరిశ్రమ భవిష్యత్కు కీలకం. కేంద్రం ఏదో ఒకటి చెప్పాలి”అని అన్నారు. ఈవీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి, మరింత శక్తిమంతంగా మార్చడానికి మరో 3–-4 సంవత్సరాల పాటు ఫేమ్ పథకాన్ని పొడగించాలని సొసైటీ పేర్కొంది.
కంపెనీల మధ్య గందరగోళం కారణంగా అవి దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాయని విమర్శించింది. సబ్సిడీలను తగ్గిస్తే ఈవీల మార్కెట్ దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈవీల బ్యాటరీలు, మోటార్లు వంటి ముఖ్యమైన భాగాలను స్థానికంగా తయారు చేయడం వీలుకావడం లేదని, సప్లై చెయిన్కు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇదీ ఒకటని పేర్కొంది. ఇప్పటికే ఉన్న సబ్సిడీ విధానంలోని లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని కూడా పిలుపునిచ్చింది. ప్రభుత్వం సబ్సిడీ నేరుగా కస్టమర్కు ఇస్తేనే అక్రమాలు తగ్గుతాయని తెలిపింది.