
ఆషాఢమాసంలో ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగం కార్యక్రమాన్ని జులై 14 న నిర్వహించేందుకు... భవిష్యవాణి చెప్పేందుకు మాతంగి స్వర్ణలత ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారు. కర్నాటక లక్ష్మి ( ఏనుగు) ను ఆలయాధికారులు తీసుకొచ్చారు.
సికింద్రాబాద్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఘటంతో ఎదుర్కోలు వేడుకలు నిర్వహిస్తారు. మహంకాళి అమ్మవారు తన ఉత్సవాలకు రావలసిందిగా తన తోటి 18 మంది అక్కచెల్లెళ్లను ఆహ్వానించడమే ఈ ఘటోత్సవం. ఆ తరువాత న్యూబోయిగూడలోని దండు మారమ్మ ఆలయానికి వెళ్తారు. అది మహంకాళి పుట్టినిల్లు. అక్కడి నుంచి గర్భాలయానికి చేరుకోవడంతో ఎదుర్కోలు ఘట్టం ముగుస్తుంది. ఆ తరువాత బోనాల ఉత్సవాలు....రంగంనిర్వహిస్తారు. ఈ ఆధ్యాత్మిక వేదికను స్వర్ణలత తమ్ముడు దినేష్ అలంకరిస్తాడు.
పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. జేగంటలు మోగుతాయి. పంబజోడు ఉత్సవం ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చేరుకుంటుంది స్వర్ణలత. ‘ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. నేరుగా రంగం వద్దకు వస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు... అంటున్న మాతంగి స్వర్ణలత ఆ తుదిఘట్టంలో భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె వినిపించే భవిష్యవాణి ఈ ఏడాది ఎలా ఉంటుందో ఎదురు చూద్దాం.