
మెదక్/పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్ -2 ఫలితాల్లో మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుష్మిత డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. కొల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత శాస్త్రం టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న ఈమె గ్రూప్స్ పరీక్షలో సత్తా చాటారు. నిరుపేదల సమస్యలు తనకు తెలుసునని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఏఎస్ వో ఉద్యోగానికి..
చేగుంట మండలం మక్క రాజ్ పేట్ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న పట్టణానికి చెందిన అల్లి విజయసేనారెడ్డి గ్రూప్ - 2 లో సత్తా చాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోని ఏఎస్ వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన పీఆర్టీయూ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయసేనారెడ్డి ఎంపిక పట్ల పీఆర్టీయూ నాయకులు మల్లారెడ్డి, వెంకట్రాంరెడ్డి, సుంకరి కృష్ణ, హరిబాబు, సుభాష్ రెడ్డి, నరేందర్ చేగుంట మండల పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు, తిరుపతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
వెంకట్ దీప్కు కాట సుధారాణి అభినందన
అమీన్పూర్: గ్రూప్ 1 పరీక్షల్లో 141వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైన వెంకట్దీప్ను కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని బీరంగూడలోని వెంకట్దీప్ నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను కలసి శుభాకాంక్షలు తెలిపారు. వెంకట్ దీప్కు స్వీటు తినిపించారు. వెంకట్దీప్ డీఎస్పీగా ఎంపికవడం మన ప్రాంతానికి గర్వకారణమన్నారు.