
- ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: మెదక్కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని ఆయా శాఖల ఆఫీసుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమయపాలన పాటించని అధికారులు, సమాచారం ఇవ్వకుండా సెలవులపై వెళ్లిన ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని డీఆర్వో భుజంగరావును ఆదేశించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏవో యూనస్, అకౌంటెంట్ పరమేశ్, సిబ్బంది ఉన్నారు.
నేడు అధికారులకు సెలవు రద్దు
వర్షాలు, వరదల వల్ల జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగినందున ఆదివారం అన్ని శాఖలకు సెలవు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల సిబ్బంది వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణి దరఖాస్తులను హెల్ప్డెస్క్ ద్వారా స్వీకరిస్తామని చెప్పారు.
మంజీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. మహారాష్ట్ర లోని లాతూర్, కర్నాటకలోని సాయిగామ్ ప్రాంతాల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు చేరుతుందన్నారు. ఆ నీటిని మంజీరా నదిలోకి విడుదల చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఎవరూ ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. పశువుల కాపర్లు, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దన్నారు.
గణేశ్ నిమజ్జనంలో సమన్వయం పాటించాలి
ప్రస్తుతం జిల్లాలో చెరువులు నిండు కుండలా ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని గణేశ్ నిమజ్జన సమయంలో భక్తులు సమన్వయం పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు.
మండలంలోని కోంటూరు చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారు మాట్లాడుతూ..నిమజ్జన ప్రదేశాల్లో ఫెన్సింగ్, లైటింగ్, క్రేన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, తహసీల్దార్లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.