
- మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
టేక్మాల్, మెదక్ టౌన్, అల్లాదుర్గం, వెలుగు: మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల పంటలకు నష్టానికి సంబంధించి అంచనాలు వేగవంతంగా పూర్తి చేయాలని, అదే సమయంలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. బుధవారం టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లిలోని గుండువాగు వల్ల దెబ్బతిన్న పత్తి పంటతోపాటు ఆయా పంటలు, రోడ్లను పరిశీలించారు. అల్లాదుర్గం మండల కేంద్రంలో బద్దికుంటను, గడిపెద్దాపూర్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరద నష్టం అంచనా వేయాలి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, హెల్త్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా వరద నష్టం అంచనాలపై రివ్యూ చేశారు. అనంతరం మాట్లాడుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలను అనుసరించి నష్టం అంచనాలను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, డీఎంహెచ్వో శ్రీరామ్, పీఆర్ ఈఈ నర్సింలు, ఆర్అండ్బీ ఈఈ సర్దార్ సింగ్, ఇరిగేషన్, సంబంధిత డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.