మెదక్ జిల్లా: మంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. బాధితులతో మాట్లాడిన అధికారులు.. వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సతీష్ విచారణకు గ్రామానికి చేరుకుని విచారణ నిర్వహించారు. అచ్చంపేటలో విజిలెన్స్ విచారణ తీరును మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. ప్రాథమిక విచారణలో అసైన్డ్ ల్యాండ్ అక్రమించినట్లుగా గుర్తించామన్నారు. భూకబ్జాలకు పాల్పడటం చట్టపరంగా నేరమన్నారు కలెక్టర్. 3 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నామని.. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. బాధితులకు అన్యాయం జరిగిందని.. ప్రస్తుతం 117 ఎకరాల్లో సర్వే కొనసాగుతోందని తెలిపారు కలెక్టర్.
అసైన్డ్ భూముల వ్యవహారంలో విచారణ క్రమంలో గ్రామంలో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. పొరుగు జిల్లాల నుంచి కూడా గ్రామానికి బలగాలు చేరుకున్నాయి. శామీర్ పేటలోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈటలపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అచ్చంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.