
శివ్వంపేట, వెలుగు: ఉరేసుకుని టెన్త్ విద్యార్థిని చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మృతురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన ప్రకారం.. శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన బుడిగే మల్లేశ్, మణెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రోజా (16) టెన్త్ క్లాస్ చదువుతుంది.
కొద్దిరోజులుగా అదే మండలంలోని దొంతి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో ఫోన్ లో మాట్లాడుతుండగా, పది రోజుల కింద ఆమెను తల్లిదండ్రులు మందలించారు. కాగా.. ఆదివారం బంధువు చనిపోవడంతో పేరెంట్స్ కామారం గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రశాంత్ కొంతన్ పల్లికి వచ్చి రోజాతో మాట్లాడుతుండగా స్థానికులు చూశారు.
ఆ విషయం ఇంట్లో చెబుతారని భయపడిన రోజా ఉరేసుకుంది. ఇంట్లో అద్దెకు ఉండే శిరీష అనే మహిళ చూసి సమాచారం ఇవ్వగా కుటుంబసభ్యులు వచ్చి రోజాను తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతురాలి తండ్రి మల్లేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు.