
- కొత్త మండలాలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని గత జడ్పీ సమావేశంలో మంత్రి ఆదేశం
- మూణ్నెళ్లైనా ఫండ్స్ముచ్చటే లేదు.. మండలాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే..
మెదక్ (నిజాంపేట, చిలప్చెడ్), వెలుగు : కొత్తగా ఏర్పడిన ఆరు మండలాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించినా ఫలితం లేదు. మూడు నెలలైనా ఒక్క మండలానికి కూడా ఒక్క రూపాయి రిలీజ్ కాలేదు. మూడు నెలల కింద నిర్వహించిన మెదక్ జడ్పీ సమావేశంలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రతీ కొత్త మండలానికి రూ.5 లక్షల చొప్పున ఫండ్స్ కేటాయించాలని మంత్రి హరీశ్రావు కలెక్టర్ను ఆదేశించినా నిధులు ఇవ్వకపోవడంతో కొత్త మండలాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
గత మీటింగ్లో...
గత సెప్టెంబర్ 22న జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో కొత్త మండలాల్లో ఫండ్స్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, ఫర్నీచర్ లేదని, ఆఫీసుల కిరాయి కట్టడానికి తిప్పలు పడాల్సి వస్తోందని చిలప్చెడ్ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, నార్సింగి ఎంపీపీ సబిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి హరీశ్రావు స్పందిస్తూ ఆ మండలాలకు రూ.5 లక్షలు కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ క్రమంలో ఇతర కొత్త మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం తమ మండలాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, తమకు కూడా ఫండ్స్ కావాలని కోరారు. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆరు మండలాలకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. అయితే జడ్పీ మీటింగ్ జరిగి మూడు నెలలై మళ్లీ మీటింగ్ సమయం వచ్చినా ఇంతవరకు ఆయా మండలాలకు ఫండ్స్ రాలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. శనివారం జడ్పీ జనరల్బాడీ మీటింగ్జరుగనుండగా కొత్త మండలాల్లో నెలకొన్నసమస్యలు మరోమారు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
కొత్త మండలాల పరిస్థితి ఇదీ..
ప్రభుత్వం 2016లో మెదక్ జిల్లాలో కొత్తగా హవేలీఘనపూర్, నిజాంపేట, నార్సింగి, మనోహరాబాద్, చిలప్చెడ్ మండలాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత దాదాపు రెండేళ్ల కిందట మాసాయిపేట మండలం ఏర్పాటైంది. కాగా ఆయా మండల కేంద్రాల్లో రెండు, మూడు చోట్ల మినహా ఎంపీడీఓ, తహసీల్దార్, అగ్రికల్చర్, ఐకేపీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు కిరాయి బిల్డింగ్ ల్లో, పెంకుటిండ్లలో ఏర్పాటు చేశారు. వాటిలో ఆఫీస్ నిర్వహణకు అనుకూలంగా రూమ్లు, వసతులు లేవు. దీంతో ఆయా ఆఫీసులలో పనిచేసే అధికారులు, ఉద్యోగులతోపాటు, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు అవస్థలు పడుతున్నారు. నిజాంపేటలో అనువైన బిల్డింగ్ దొరకకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్ ను పెంకుటింట్లో ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా ఆయా సమస్యలను కొంతవరకైనా పరిష్కరించుకుందామనుకుంటే ఫండ్స్లేక ఇబ్బంది అవుతోందని ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫండ్స్ మంజూరు చేయాలి
కొత్త మండలం ఏర్పాటైనప్పటికీ ఆఫీసులకు సొంత బిల్డింగ్లు లేక ఇబ్బంది అవుతోంది. గత జడ్పీ మీటింగ్లో ఈ విషయాల గురించి మాట్లాడితే మంత్రి మండలానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పారు. కానీ ఇంతవరకు రాలేదు. వెంటనే ఆ ఫండ్స్ మంజూరు చేస్తే కొంత వరకైనా సమస్యలు తీరుతాయి.
- వినోద దుర్గారెడ్డి, ఎంపీపీ చిలప్ చెడ్