- మండలిలో ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారక్క గద్దెల చుట్టూరా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాకారాన్ని ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఇందుకు ఒకరోజు ముందునుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మేడారంలోనే బస చేస్తారని, అందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మేడారం ప్రాకార నిర్మాణ పనులపై చర్చ జరిగింది. వైదిక సంస్కృతితో నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత, అర్టీసీ చార్జీలపై తీన్మార్ మల్లన్న మాట్లాడారు. అలాగే హెలికాఫ్టర్ సర్వీస్లపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మహేశ్కుమార్గౌడ్ తమ అభిప్రాయాలు తెలిపారు.
200 ఏండ్లకు పైగా పటిష్టంగా ఉండేలా నిర్మాణం
రాతి గోడల నిర్మాణం 200 ఏండ్లకుపైగా పటిష్టంగా నిలబడేలా ఉంటుందని, రూ.200 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు 95% పనులు పూర్తయ్యాయన్నారు. మేడారం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఆధునీకరణ పనుల కోసం 29 ఎకరాల భూమిని సేకరించామన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో 63 ఎకరాల భూ సేకరణకు నిర్ణయించామన్నారు. మేడారం మహా జాతర కోసం కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
