కరోనా వల్ల జాతర రద్దవుతుందన్న అనుమానంతో ముందస్తు మొక్కులు
ఆదివారం ఒక్క రోజే 3 లక్షల మందికిపైగా రాక
భారీగా ట్రాఫిక్ జామ్.. సౌకర్యాలు అంతంతే
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: కరోనాతో మేడారం జాతర ఎక్కడ రద్దవుతుందోనన్న అనుమానంతో భక్తులు అక్కడికి పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారలమ్మ దర్శనానికి క్యూ కడ్తున్నారు. ఆదివారం సెలవు రోజు కలిసి రావడంతో ఒక్కరోజే 3 లక్షల మందికిపైగా భక్తులు మేడారానికి వచ్చినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ఫిబ్రవరి 16న మహాజాతర స్టార్ట్ అయ్యే నాటికి కరోనా ఇంకా పెరిగే సూచనలు కన్పిస్తుండడం, జాతర నిర్వహించేదీ లేనిదీ రివ్యూ చేసి చెప్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించడంతో భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు.
దీంతో గద్దెల ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు భారీగా రావడం, కొత్తగా టోల్ట్యాక్స్ వసూలు కోసం వాహనాలను ఆపడంతో మేడారంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి.
గద్దెల వద్దకు వెళ్లకుండా ఫెన్సింగ్కు తాళం
ఆదివారం ఉదయం వచ్చిన భక్తులు అమ్మవార్ల గద్దెలను తాకి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో రద్దీ పెరగడంతో ఎవరూ అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లకుండా ఫస్ట్ ఫెన్సింగ్కు ఆఫీసర్లు, పోలీసులు తాళం వేశారు. దీంతో తల్లుల దర్శనం దగ్గర నుంచి జరగకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
భారీగా ట్రాఫిక్ జామ్
వనదేవతల దర్శనానికి తరలివచ్చే భక్తులకు మేడారంలో టోల్గేట్ సమస్య ఎదురైంది. గ్రామ పంచాయతీ టెండర్ తో నిర్వహిస్తున్న టోల్గేట్ సిబ్బంది ‘‘పైసలిస్తేనే వెహికల్స్ను పంపిస్తం.. లేకుంటే ఆపేస్తం’’ అని ఆంక్షలు విధించారు. దీంతో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. వారిని టోల్ గేట్ ఫీజు చెల్లించేంతవరకు వాహనాల్లోనే ఉంచారు. హరిత కాకతీయ హోటల్ నుంచి జంపన్నవాగు, కన్నెపల్లి క్రాస్ వరకు సుమారు 5 కి.మీ దూరం, తాడ్వాయి రూట్లో కూడా 2 కి.మీ దూరం వెహికల్స్ ఆగిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లి జంపన్నవాగులో స్నానం చేసి అమ్మవార్ల దర్శనానికి చేరుకున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
మేడారం వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రైనీ ఐపీఎస్ సంకీర్త్, డీఎస్పీ దేవేందర్తో పాటు జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల ప్రాంగణం వరకూ ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారు.
సౌకర్యాలు అంతంతే
ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం రూ.75 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ.. ఇప్పటికీ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి పనులు పూర్తికాలేదు. పైగా నాసిరకంగా పనులు చేపట్టడంతో పనులు ఆదిలోనే బీటలు వారుతున్నాయి. వెహికల్స్ పార్కింగ్ పనులు కూడా పూర్తి చేయలేదు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసుల్లో ఇటీవల కురిసిన వర్షానికి నీళ్లు వచ్చాయి. దీంతో భక్తులు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.