- ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బదిలీ.. నిజామాబాద్లో బాధ్యతల స్వీకరణ
మేడారం జాతర ముందు మరోసారి కలెక్టర్ బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్గా ఉన్న సి.నారాయణ రెడ్డిని ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆదివారం సడన్గా ఆయన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మంగళవారం ఆయన నిజామాబాద్ కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ జిల్లా కేంద్రానికి చేరుకున్న నారాయణరెడ్డికి పాత కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు బాధ్యతలు అప్పగించారు.
రెండేళ్ల క్రితం అప్పటి జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి… నేడు ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.. ఇద్దరూ మేడారం జాతర ముందే బదిలీ అయ్యారు. ఈ ఇద్దరి బదిలీ వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది. ఈ జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అయితే ఈ పనుల్ని గతంలో ముక్కలుగా విడగొట్టి నామినేషన్ కింది చేసుకునేవాళ్లు రాజకీయ నాయకులు. కానీ, ఈ సారి ముగులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆ రకంగా జరిగేందుకు అవకాశం ఇవ్వలేదు. టెండర్లు పిలిచి, పనులు పక్కాగా జరగాలని కంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఓ మంత్రి దగ్గర ఒత్తిడి తెచ్చి టీఆర్ఎస్ నాయకులే సి.నారాయణరెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించారని ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. 2018 జాతరకు ముందు కూడా జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి ఇలానే బదిలీ చేయించారని తెలుస్తోంది.