
55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ లో అప్పుడే అలకలు మొదలయ్యాయి. మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడిన హరివర్దన్ రెడ్డి కంటతడి పెట్టారు. ప్రస్తుతం మూడుచింతలపల్లి zptcగా ఉన్న హరివర్ధన్ కాంగ్రెస్ నుంచి మేడ్చల్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం అక్కడి నుంచి తోటకూర వజ్రేష్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది.
దీంతో హరివర్థన్ వెంటనే తన అనుచరవర్గంతో కలిసి కీసరలో కీలక సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకుని బుజ్జగించేందుకు అక్కడకు వచ్చిన వజ్రేష్ యాదవ్ ను హరివర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.
కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టాపడ్డానని కానీ పార్టీ తనను గుర్తించలేదని హరివర్థన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో తన ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. దాదాపు 90 వేల మందితో సభ్యత్వ నమోదు చేయించానని అన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని హరివర్థన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలంటే అసహ్యం వేస్తుందని తెలిపారు.