- ప్రధాన ద్వారం మాత్రమే ఓపెన్.. అది కూడా ఒక్క తలుపే
- ఇద్దరు, ముగ్గురు భద్రతా సిబ్బందితో చెకింగ్స్
- ఇరిగేషన్ శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. నీటిపారుదల శాఖ సమాచారం లీక్ అవుతోందన్న అనుమానాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆఫీస్లోకి మీడియాను అనుమతించడం లేదు. ఉద్యోగులు తమ ఐడీ కార్డును చూపిస్తేగానీ లోపలికి పంపడం లేదు. జలసౌధ ప్రధాన ద్వారం వద్ద, లోపల లిఫ్టుల వద్ద గోడలపై ఆంక్షలకు సంబంధించిన పోస్టర్లనూ అంటించారు.
బయటి వ్యక్తులు రిజిస్టర్లో పేర్లను నమోదు చేసి వెళ్లాలని పేర్కొన్నారు. జర్నలిస్టులను మాత్రం అస్సలు అనుమతించడం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డోర్లన్నీ క్లోజ్..
జలసౌధలోకి వెళ్లే అన్ని డోర్లను క్లోజ్ చేయాలని ఈఎన్సీ అడ్మిన్ శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన ద్వారాన్ని కూడా ఒక తలుపును మూసి.. ఒక్క రెక్కను మాత్రమే తెరిచి ఉంచాలని హుకూం జారీ చేశారు. ఇద్దరు, ముగ్గురు భద్రతా సిబ్బందిని పెట్టి సీనియర్ అధికారులతో పాటు సిబ్బంది ఐడీ కార్డులను చెక్ చేసి పంపిస్తున్నారు. ఐడీ లేదంటే ఆపేస్తున్నారు. సీనియర్అధికారులనూ ఐడీ కార్డులు అడగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మీడియా ప్రతినిధులను డోర్ వద్దే ఆపేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్లాలో స్లిప్పు రాసి.. సదరు అధికారికి పంపుతామని, అక్కడి నుంచి పర్మిషన్ వస్తేనే వెళ్లాలని చెప్తున్నారు.
కానీ, లోపలి నుంచి ఎంత సేపటికీ పర్మిషన్ రాకపోడంతో మీడియా ప్రతినిధులు వెనుదిరుగుతున్నారు. అంతేకాదు, మీడియా ప్రతినిధులు ఎవరొస్తున్నారు? ఎవరి దగ్గరకు వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? వంటి సమాచారమంతటినీ జలసౌధ సిబ్బంది రికార్డు చేస్తున్నారు. దీంతో అధికారుల నిర్వాకం వల్ల అసలు ఇరిగేషన్శాఖలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది.
