హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ సీట్ల భర్తీకి చేపట్టిన ఆలిండియా కోటా మాపప్ రౌండ్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు తాజాగా మాపప్ కౌన్సెలింగ్ చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్ర కౌన్సెలింగ్లో పీజీ సీట్లు పొందిన స్టూడెంట్లు మాపప్ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించింది. ఎంసీసీ నిర్ణయంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. మంచి కాలేజీలో సీటు కోసం కొందరు స్టూడెంట్లు స్టేట్ కౌన్సెలింగ్లో వచ్చిన సీట్లను వదులుకుని మాపప్ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. సీటు వచ్చి కాలేజీల్లో కూడా చేరిపోయారు. ఇప్పుడు ఉన్నపళంగా కౌన్సెలింగ్ రద్దు చేయడం, మళ్లీ తాజాగా నిర్వహించే కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించడంతో తమ భవిష్యత్ ఏంటని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఆలిండియా కోటా మాపప్ రౌండ్ తర్వాత స్టేట్ కోటా మాపప్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీని వల్ల ఆలిండియా కోటాలో సీటు రాని వాళ్లు.. స్టేట్ కోటా చివరి రౌండ్లో పాల్గొని సీటు పొందే అవకాశం ఉంటుంది. ఈసారి కూడా అలాగే చేశారు. ఆలిండియా కోటా చివరి రౌండ్ కౌన్సెలింగ్ అవ్వగానే, స్టేట్ కోటా చివరి రౌండ్ నిర్వహించారు. అయితే, ఇప్పుడు ఆలిండియా కోటా చివరి రౌండ్ కౌన్సెలింగ్ను ఎంసీసీ రద్దు చేసింది. ఎంసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థుల్లోనూ భయం పట్టుకుంది. దీంతో కర్నాటక ప్రభుత్వం స్టేట్ కోటా చివరి రౌండ్ కౌన్సెలింగ్ను రద్దు చేసింది. ఆలిండియా కోటా చివరి రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక, స్టేట్ కోటా నిర్వహిస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని మెడికోలు కోరుతున్నారు. ఇదే విషయంపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ, రిజిస్ర్టార్లను ఫోన్లో సంప్రదించగా, వారు స్పందించలేదు.