
- సిబ్బంది లేకపోవడంతో పర్మిషన్లను హోల్డ్ చేసిన ఎన్ఎంసీ
- అప్పీల్కు ఈనెల 19 వరకు డెడ్ లైన్
- గడువులోగా భర్తీకి ఆఫీసర్ల కష్టాలు
- కాలేజీలకు ఎలాగైనా పర్మిషన్లు తేవాలంటున్న ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కోసం మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు జల్లెడ పడుతున్నారు. కొత్తవాళ్లు దొరక్కపోవడం, ఉన్నవాళ్లు కొత్త కాలేజీల్లో పనిచేసేందుకు ఇష్టపడకపోవడంతో ఫ్యాకల్టీని భర్తీచేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఫ్యాకల్టీ లేరన్న కారణంతో జోగుళాంబ గద్వాల, ములుగు, మెదక్, మహేశ్వరం (రంగారెడ్డి), నర్సంపేట (వరంగల్), కుత్బుల్లాపూర్ (మేడ్చల్), యాదాద్రి భువనగిరి, నారాయణపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్లను ఎన్ ఎంసీ హోల్డ్ లో పెట్టింది. ఫ్యాకల్టీని భర్తీచేస్తేనే పర్మిషన్లు ఇస్తామని పది రోజుల క్రితమే లేఖ పంపింది. సిబ్బందిని భర్తీచేసి, లోపాలను సవరించుకుని అప్పీల్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. ఈ విషయం బయటకు రావడంతో ఆయా నియోజకవర్గాలు, జిల్లాల ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా ఫ్యాకల్టీని తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు. నారాయణపేట కాలేజీ పర్మిషన్ గురించి చర్చించేందుకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సోమవారం డీఎంఈ వాణిని కలిశారు. నారాయణపేట, గద్వాల కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత విపరీతంగా ఉందని, కొత్తవాళ్లను నియమించాలని ఆమె కోరినట్లు తెలిసింది.
పైరవీల పరేషాన్
ఇటీవల కొత్త కాలేజీల్లో పోస్టింగ్ తీసుకున్న అసోసియేట్ ప్రొఫెసర్లలో చాలా మంది ఆయా కాలేజీల్లో జాయిన్ కాలేదు. పోస్ట్ మాడిఫికేషన్ కోసం ఆరోగ్య శాఖ మంత్రి ఆఫీసు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరి కొంతమంది ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు.. వారు కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తున్నారు. ఇలా అయితే కొత్త కాలేజీలకు పర్మిషన్ రావడం కష్టం అవుతుందని తాము చెప్పినా వారు వినడం లేదని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా గద్వాల, నారాయణపేట, ములుగు కాలేజీల్లో చేరేందుకు ఫ్యాకల్టీ అస్సలు ఇష్టపడడం లేదు. ఈ కాలేజీలు హైదరాబాద్ కు దూరంగా ఉండడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియాలో ఏండ్లుగా తిష్టవేసిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీల్లో పోస్టింగుల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల్లోకి వెళ్లేందుకు మాత్రం ఇష్టపడడం లేదు. కొంత మందైతే ప్రమోషన్ ను కూడా వదులుకుంటున్నారు తప్పితే, జిల్లాల్లోకి వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు.
ఎలా భర్తీ చేద్దాం?
ఎన్ ఎంసీ ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో ఫ్యాకల్టీ భర్తీకి ఉన్న అన్ని అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చి, వారికి కొత్త కాలేజీల్లో పోస్టింగ్ ఇచ్చారు. అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చే ప్రక్రియ, ప్రొఫెసర్లకు అడిషనల్ డీఎంఈలుగా ప్రమోషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వీళ్లకు కూడా కొత్త కాలేజీల్లోనే పోస్టింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్ సీలలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్ల డిజిగ్నేషన్ ను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మార్చి, మెడికల్ కాలేజీల్లో వారికి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను అబ్సార్ప్షన్ గా పిలుస్తారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖలో ఫ్యాకల్టీ ట్రాన్స్ ఫర్లలో కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాన్స్ ఫర్లలో కూడా కొత్త కాలేజీల్లోని పోస్టులనే తొలుత భర్తీ చేయాలని భావిస్తున్నారు.