మెడికల్​ వేస్ట్​ రోజుకు 16 టన్నులు

మెడికల్​ వేస్ట్​ రోజుకు 16 టన్నులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో మెడికల్​ వేస్ట్​ ఏటేటా పెరిగిపోతోంది. వాటి నిర్వహణ, ప్లాంట్లకు తరలింపుల్లో కొన్ని హాస్పిటళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లను కలిపితే రోజూ 16 టన్నులకుపైనే మెడికల్​ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2017లో 3,039 హాస్పిటళ్ల నుంచి రోజూ సగటున 15.719 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయితే 2018లో 16.243 టన్నులకు పెరిగింది. వాటిలో సెలైన్​ బాటిళ్లు, సిరంజీలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వాటిని సరిగ్గా డిస్పోజ్​ చేయట్లేదని, ప్లాంట్లకు తరలించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు తెలంగాణ పొల్యూషన్​ బోర్డు గుర్తించింది. నిబంధనలు పాటించని 10 ఆస్పత్రులకు నోటీసులిచ్చింది.

11 చోట్ల ట్రీట్​మెంట్​ ప్లాంట్లు

ఆస్పత్రుల నుంచి నాలుగు రకాల వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటిలో బ్లూ కేటగిరీకి చెందిన డిస్పోజబుల్​ సెలైన్​ బాటిళ్లు ఎక్కువైనట్టు పీసీబీ గుర్తించింది. 2017లో రోజుకు 96 కిలోలు ఉత్పత్తి అయితే, 2018లో 807 కిలోలకు పెరిగింది. ఎల్లో కేటగిరీలోని ఇన్​ఫెక్షన్​ ఉన్న అవయవాలు, బొడ్డు పేగులు, రక్తంతో తడిసిన వస్తువులు, బ్యాండేజీలు, కాటన్​ వంటివి ఉంటాయి. ఆయా వేస్ట్​ను వేరు చేయాల్సి ఉంటుంది. 2017లో ఇవి రోజుకు 9.899 టన్నులు ఉత్పత్తి అయితే, 2018లో 11.035 టన్నులకు పెరిగింది. ఈ వ్యర్థాలన్నింటినీ కామన్​ బయో మెడికల్​ వేస్ట్​ ట్రీట్​మెంట్​ ఫెసిలిటీ ప్లాంట్లకు తరలించాల్సి ఉంటుంది. ఆ ప్లాంట్లకు వచ్చే వ్యర్థాలను 800 డిగ్రీల వేడిలో కాల్చేస్తారు. కొన్నింటిని పూడ్చిపెడతారు. ఇలాంటి మెడిక్లీన్​ ప్లాంట్లు 11 చోట్ల ఉన్నాయి. హైదరాబాద్​, మేడ్చల్​ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్లాంట్లు, ఉమ్మడి జిల్లాల పరిధిలో మరో 8 ఉన్నాయి. అయితే కొన్ని హాస్పిటళ్లను వ్యర్థాలను వేరు చేయకుండా ఒకే సంచిలో వేసి ప్లాంట్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

10 హాస్పిటళ్లకు పీసీబీ నోటీసులు

రాష్ట్రంలో మెడికల్‌‌‌‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించని 10 ఆస్పత్రులను పీసీబీ విచారించనుంది. పేస్​ హాస్పిటల్​ (బేగంపేట), విశ్వాస్​ హాస్పిటల్​ (చంపాపేట), నవోదయ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (మహబూబ్​నగర్​), అపోలో రీచ్​ హాస్పిటల్​అండ్​ సేఫ్​లైఫ్​ హాస్పిటల్​(కరీంనగర్​), ప్రసాద్​ హాస్పిటల్​(కాజీపేట), వరంగల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (వరంగల్​), వాసవి హాస్పిటల్​ (హన్మకొండ), ఆరోగ్య మాతా హాస్పిటల్​ (జనగామ), ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​(నిర్మల్​), మెడిలైఫ్​ స్పెషాలిటీ హాస్పిటల్​ (బెల్లంపల్లి)కి అధికారులు నోటీసులిచ్చారు. వచ్చే రెండు నెలల్లో నిబంధనలు పాటించకపోతే హాస్పిటళ్లను మూసేస్తామని హెచ్చరించారు.