మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్(Padma Vibhushan) అవార్డును కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్బంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అత్యున్నత పురస్కారం చిరంజీవికి దక్కడంతో..పలువురు ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.
1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇండస్ట్రీకి వచ్చాక చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. స్వయం కృషితో అలుపెరగకుండా సినిమాలు చేస్తూ..ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి సామాజికంగా ఎన్నో సేవలు చేయగా ఈ అవార్డు ఆయనని వరించింది.
అయితే రేపు (మే9)న మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకకు చిరంజీవి భార్య సురేఖతో పాటు ఆయన కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరుకానున్నారు.
ఈ ఏడాదికి గాను మొత్తం 132 మంది ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించనున్నారు. వీరిలో 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రముఖ హిందీ సినీ నటి వైజయంతిమాల, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రమణ్యం, దక్షిణాది సినీ నటులు చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం)లకు పద్మవిభూషణ్తో సత్కరించనున్నారు.
ఇక అదే సమయంలో, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్, ఫాతిమా బీబీ (మరణానంతరం), ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్లకు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించనున్నారు.
ఇప్పటికే పద్మ విభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళా వేదికలో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే.