
భోపాల్: రాజా రఘువంశీ.. గత రెండు రోజులుగా ఈ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. భార్యతో హనీమూన్కు వెళ్లి అతడు దారుణ హత్యకు గురి కావడమే. రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా హత్య చేయించింది అతడి భార్య సోనమే అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుపారీ కిల్లర్స్తో మొగుడిని అంతమొందించిందని ప్రచారం జరుగుతోంది. అయితే.. హనీమూన్కు వెళ్లిన రాజా, సోనమ్ ఇద్దరు కిడ్నాప్ అయ్యారని మొదట పోలీసులకు ఫిర్యాదు అందించింది.
ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో మరణించిన రాజా రఘువంశీ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సోనమ్ ఆచూకీ మాత్రం పోలీసులకు తెలియలేదు. ఈ క్రమంలోనే సోనమ్ ఉత్తరప్రదేశ్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. తన భర్తను హత్య చేసి.. తనను ఎవరో కిడ్నాప్ చేశారని సోనమ్ పోలీసులకు తెలిపింది. పోలీసులు కూడా ఈ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. కానీ, షిల్లాంగ్ స్థానిక టూర్ గైడ్ ఆల్బర్ట్ పిడే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
మే 23న ఉదయం 10 గంటల ప్రాంతంలో మావ్లాఖియాత్ ప్రాంతం సమీపంలో రాజా రఘువంశీ అతని భార్య సోనమ్తో పాటు ముగ్గురు గుర్తు తెలియని హిందీ మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారని పిడే పోలీసులకు చెప్పాడు. ఫిడే స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. కాల్ డేటా రికార్డులు, లొకేషన్ మ్యాపింగ్ ద్వారా ఫిడే చెప్పింది నిజమేనని పోలీసులు ధృవీకరించుకున్నారు. సోనమ్, ఆమె లవర్గా చెప్పబడుతున్న రాజ్ కుష్వాహా మధ్య హనీమూన్కు ముందు, ఆ సమయంలో ఎన్క్రిప్ట్ చేయబడిన యాప్ల ద్వారా విస్తృతమైన సంభాషణ జరిగినట్లు పోలీసులు కనుగొన్నారు.
సోనమ్ తన ప్రియుడుకి ఎప్పటికప్పుడు లైవ్ లొకేషన్లు పంపగా.. అతడు వాటిని నిందితులకు సెండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సోనమ్, ఆమె లవర్ రాజ్ కుశ్వాహాపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి తగిన డిజిటల్, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇది హనీమూన్ పేరుతో జరిగిన పక్కా మర్డర్ ప్లాన్ అని పోలీసులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి టూర్ గైడ్ ఫిడే స్టేట్మెంట్తో ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మరీ మొగుడిని చంపింది భార్య సోనమే అనటానికి టూర్ గైడ్ సాక్ష్యం సరిపోతుందా లేదా చూడాలి.
రఘువంశీ హత్యపై అతడి తండ్రి మంగళవారం (జూన్ 10) మీడియాతో మాట్లాడారు. తన కొడుకు హత్య కేసులో సోనమ్ ప్రమేయం లేకపోతే ఆమెను సురక్షితంగా తిరిగి ఇంటికి తీసుకువస్తా.. ఒకవేళ సోనమ్ దోషిగా తేలితే మాత్రం ఆమెకు ఉరిశిక్ష విధించాలి. దానికి సోనమ్ అర్హురాలు అని అన్నారు. సోనమ్ను ఎప్పుడు కోడలిలా చూడలేదని.. మా సొంత బిడ్డగా చూసుకున్నామని చెప్పారు. సోనమ్కి తన కొడుకుతో ఏవైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడి ఉండేవాడినని.. ఆమె బాధలో నిజాయితీ ఉంటే తనకు మద్దతు ఇచ్చేవాడనని పేర్కొన్నారు.
మొదట సోనమ్ కిడ్నాప్ అయిందని తెలియగానే ఆమెను రక్షించడానికి రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించానని.. తర్వాత దానిని రూ. 20 లక్షలకు పెంచానని తెలిపారు. ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చే వారికి రూ. 20 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చానని.. కానీ చివరకు ఇలా జరిగిందని బాధపడ్డారు. మృతుడు రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ మాట్లాడుతూ.. ‘‘వివాహానికి ముందే సోనమ్, రాజ్ కుష్వాహాకు మధ్య సంబంధం ఉందని ఆమె తల్లికి తెలుసు. రాజాతో నా వివాహం జరిగితే ఫలితం బాగుండదని పెళ్లికి ముందే సోనమ్ తన తల్లికి చెప్పింది. సోనమ్ తల్లి ఈ విషయం మా దగ్గర దాచిపెట్టి.. రాజాతో వివాహం జరిపించింది. ఈ కేసులో సోనమ్ తల్లిని కూడా నిందితురాలిగా చేర్చాలి’’ అని డిమాండ్ చేశాడు.