నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడం కాస్త ఇబ్బందే. అందుకే కర్నాకటలో సంచార దహన వాటికను తయారు చేశారు. దీన్ని తయారు చేయడం వెనుక పెద్ద శ్రమే ఉంది. ఎందుకంటే.. ఇక్కడి తీర ప్రాంత జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన రోడ్లు లేకపోవడం, భారీ వర్షాల సమయంలో రోడ్డు మొత్తం నీటిలో మునిగి ఉండటంతో వారి కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా కరోనా సమయంలో ఓ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే పెరట్లోనే దహన సంస్కారాన్ని నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బైందూరు నియోజకవర్గంలోని ముడూరు వ్యవసాయ సహకార సమితి సభ్యులు బాగా ఆలోచించి.. ఏదైనా చేయాలని నిర్ణయించారు. రూ. 5.8 లక్షలతో కొత్త పరికరాన్ని తయారు చేయించారు. దానికి ‘సంచార శ్మశానం’ అని పేరు కూడా పెట్టారు. రవాణా, దహన సంస్కారానికి అయ్యే ఖర్చును ముడూరు వ్యవసాయ సహకార సమితే భరిస్తోంది.
కేరళకు చెందిన స్టార్ ఛైర్ సంస్థ దీన్ని తయారు చేసింది.
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని దహనవాటికను తయారు చేయించారు. ఈ పరికరం 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉంటుంది. శవదహన సమయంలో ఎవరికీ కనపడకుండా పైన ఒక డోమ్ను అమర్చుకునే సదుపాయం ఉంటుంది. ఇది విద్యుత్తు, గ్యాస్ రెండింటితోనూ పని చేస్తుంది. ఒక డెడ్ బాడీని దహనం చేసేందుకు 10 కిలోల గ్యాస్, 100 గ్రాముల కర్పూరం అవసరమవుతుందని వ్యవసాయ సహకార సమితి అధ్యక్షులు విజయశాస్త్రి తెలిపారు.
గ్యాసు, కరెంటుతో పని చేయడం వల్ల కాలుష్యం ఉండదని, చక్రాలు అమర్చడం వల్ల ఎక్కడికైనా తేలికగా తరలించుకోవచ్చు. కొన్ని నిమిషాల్లోనే దహన ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. బూడిద, ఇతర అవశేషాలు కింద ఒక పేటికలోకి చేరతాయి. వాటిని నిమజ్జనం నిమిత్తం మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తారు. కర్ణాటకలో ఇలాంటి సంచార శ్మశానాన్ని వినియోగించడం ఇదే తొలిసారి.
