రుణమాఫీ అయ్యిందని మెసేజ్​.. కాలేదంటూ బ్యాంకర్ల కొర్రీ

రుణమాఫీ అయ్యిందని మెసేజ్​..  కాలేదంటూ బ్యాంకర్ల కొర్రీ

మెదక్ టౌన్, వెలుగు:   రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు తమకు ఫోన్​లో మెసేజ్​లు వచ్చినా బ్యాంక్ ఆఫీసర్లు తమకు రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ  గురువారం మెదక్​ జిల్లా కేంద్రంలోని ఇండియన్​ బ్యాంకు వద్ద అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు.  వివరాలిలా ఉన్నాయి..  మెదక్​ మండలం రాజ్​పల్లి గ్రామానికి చెందిన యాభై మందికి పైగా రైతులు బ్యాంకుకు వచ్చి తమకు వచ్చిన మెసేజ్​లను బ్యాంకు ఆఫీసర్లకు చూపించారు. అయితే రుణమాఫీ కాలేదని మేనేజర్​ తెలపడంతో ఆగ్రహంతో రైతులు బ్యాంకు ముందు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్​ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న మెదక్​ టౌన్​ సీఐ వెంకటేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపచేశారు.  తర్వాత సీఐ వెంకటేశం రైతులతో కలిసి మేనేజర్​ వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేనేజర్​ నరేంద్ర మాట్లాడుతూ.. బ్యాంకు గైడ్​లైన్స్​ ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని, ఇక్కడకు తాను కొత్తగా వచ్చానని ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వెంటనే ఫోన్​లో మాట్లాడారు. రైతులకు సంబంధించిన  వివరాలను తీసుకుని వారం, పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.