మూడు రోజులు ఎల్లో అలెర్ట్
ముంపుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ అధికారుల సూచన
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. రేపు, ఎల్లుండి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. తాజా హెచ్చరికల క్రమంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.