
కశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. మే 6న అర్థరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ పాక్ కు వణుకు పుట్టించింది.
అయితే ఈ ఆపరేషన్ జరిగిన రోజు రాత్రి భారత త్రివిధ దళాధిపతులు ఎలా మానిటరింగ్ చేశారనే దానికి సంబంధించి ఫోటోలు లేటెస్ట్ గా బయటకు వచ్చాయి. కమాండ్ సెంటర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఆపరేషన్ సిందూర్ కు నాయకత్వం వహించారు. ఎప్పటికప్పుడు సైనికులకు సలహాలు,ఆదేశాలిస్తూ ఆపరేషన్ సిందూర్ ను సక్సెస్ చేశారు.
మే 6 న అర్థరాత్రి 1.05 గంటల నుంచి 1.30గంటల వరకు ఆపరేషన్ సింధూర్ జరిగిన సంగతి తెలిసిందే. 25 నిమిషాలు 24 మిసైళ్లతో పీవోకే,పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది భారత్ సైన్యం. పక్కా ఇంటిలిజెన్స్ సమాచారంతో పీవోకే, పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి.ఈ ఆపరేషన్ సిందూర్ లో జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్లతో సంబంధం ఉన్న 100 మందికి పైగా ఉగ్రవాదులుఈ దాడుల్లో మరణించారని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.
తర్వాత పాక్ దిగిరావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్. సరిహద్దులో మళ్లీ ఎప్పుడైనా పాక్ చిన్నపాటి అలజడి సృష్టించినా మళ్లీ యుద్ధమేనని ప్రధాని మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.