ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభం మరమ్మతు పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిన ఓ వలస కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహారాష్ట్ర రాష్ట్రం యవత్మాల్ జిల్లా దేవరంగ్ గ్రామానికి చెందిన ప్రకాష్ ఉపాధి కోసం ఖానాపూర్కు వలస వచ్చాడు. ఇటీవల వీచిన బలమైన గాలిదుమారంతో బావాపూర్ గ్రామంలో పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ వలస కార్మికులతో మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభంపై ఎక్కి పనిచేస్తున్న ప్రకాష్ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. గాయపడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
