- ఏడుగురికి తీవ్ర గాయాలు.. కొనసాగుతున్న ఉద్రిక్తత
ఇంఫాల్: మణిపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దుల్లోని మోరేలో మిలిటెంట్లు పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేయగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను ఇంఫాల్ ఆసుపత్రికి తరలించారు. మణిపూర్లో పౌరులపై దుండగులు కాల్పులు జరిపిన మర్నాడే.. భద్రతాదళాలపై మిలిటెంట్లు దాడి చేయడం గమనార్హం. థౌబాల్ జిల్లాలో సోమవారం హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ యూనిఫామ్ లో వచ్చిన మిలిటెంట్లు.. పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. దీంతో స్థానికులు వాహనాలను తగులబెట్టడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. థౌబాల్, ఇంఫాల్ కాక్చింగ్, బిష్ణుపుర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.
హింస వెనక విదేశీ హస్తం: సీఎం బీరేన్సింగ్
భద్రతా బలగాలపై దాడుల్లో మయన్మార్కు చెందిన విదేశీ కిరాయి సైనికులు పాల్గొనే అవకాశం ఉందని మణిపూర్ సీఎంఎన్ బీరెన్ సింగ్ మంగళవారం పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘మణిపూర్ను అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోంది. మిలిటెంట్లు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. మయన్మార్ వైపు నుంచి విదేశీ కిరాయి సైనికుల ప్రమేయంపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు సెర్చింగ్, కూంబింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో టచ్లో ఉంది. రాష్ట్ర, కేంద్ర భద్రతా దళాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి”అని బీరేన్ సింగ్ చెప్పారు.