
- మంత్రి అడ్లూరి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మైనారిటీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో వచ్చిన సాంకేతిక సమస్యను పరిష్కరించామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉద్యోగుల జీతాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. శనివారం సెక్రటేరియెట్లో మంత్రి అడ్లూరి ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘‘మైనారిటీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద జరిగిన చిన్న పొరపాటు ఇది.
వెంటనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి సమస్య పరిష్కరించాం. జీవో విడుదల చేసి పాత జీతాలు ఇప్పించే ఏర్పాట్లు చేశాం’’ అని అన్నారు. జూనియర్ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ, స్టాఫ్ నర్స్, ఐసీటీ ఇన్స్ట్రక్టర్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ల వేతనాల విషయంలో లెక్కింపులో పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. కాగా.. ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలపై ఆఫీసర్లతో శనివారం సెక్రటేరియెట్లో మంత్రి అడ్లూరి సమీక్ష నిర్వహించారు.